దేశంలోనే మోస్ట్ పవర్ ఫుల్ నేనే

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ విషయంనైనా తనకు అనుకూలంగా మల్చుకుని పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎవరైనా ఆయన్ను విమర్శిస్తే లభించిందే ఛాన్స్ అన్నట్లుగా ఆవిమర్శలకు వరుసగా స్పందిస్తూ దానిపై రచ్చ చేస్తూ పబ్లిసిటీ ని దక్కించుకుంటాడు. ఇప్పుడు అదే తరహాలో కంగనా రనౌత్ కూడా వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె తన గురించి మాత్రమే కాకుండా అన్ని విషయాల గురించి స్పందిస్తూ ఎప్పుడు కూడా మీడియాలో ఉంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆమె పై పలు చోట్ల కేసులు నమోదు అయ్యి ఉన్నాయి. రైతులకు వ్యతిరేంగా మాట్లాడటంతో పాటు పలు సందర్బాల్లో ఆమె బీజేపీని వ్యతిరేకించే వారిని తీవ్ర స్థాయిలో విమర్శించింది. ఆమె సోషల్ మీడియా పోస్ట్ లు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి.

కంగనా సోషల్ మీడియా పోస్ట్ లు వివాదాలకు దారి తీస్తున్న నేపథ్యంలో ఆమె ప్రతి పోస్ట్ ను కూడా సెన్సార్ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు అయ్యింది. కోర్టు ఆ పిల్ ను విచారిస్తుందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. కాని ఈ విషయం మాత్రం వైరల్ అవుతోంది. కంగనా రనౌత్ సోషల్ మీడియా పోస్ట్ లకు సెన్సార్ అవసరం అంటూ దాఖలైన పిల్ పై ఆమె కాస్త విభిన్నంగా స్పందించింది. సోషల్ మీడియాలో ఆమె నవ్వుతున్నట్లుగా ఈమోజీ పెట్టి ఇప్పుడు నేను దేశంలోనే మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ను అంటూ తనకు తాను కితాబిచ్చుకుంది. దేశంలో బలమైన ఉమెన్ గా గుర్తింపు దక్కినందుకు సంతోషం అన్నట్లుగా ఆ అమ్మడు నెట్టింట పోస్ట్ పెట్టడం మరింత చర్చనీయాంశం అయ్యింది.

ఇటీవలే ఈమె కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ లో ఆమె స్పందిస్తూ కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపినందుకు గాను పంజాబ్ కు చెందిన ఒక వ్యక్తి తనను చంపేస్తానంటూ బహిరంగంగా ప్రకటించాడు. తాను ఇప్పటికే ఆయన పై ఫిర్యాదు చేశాను. ఇప్పటి వరకు మీ నుండి స్పందన రాలేదు అంటూ కంగనా రనౌత్ లేఖ లో పేర్కొంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ విషయమై స్పందించాల్సిందే అంటూ కంగనా డిమాండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల వారిలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పటిలాగే కంగనా మీడియాలో హడావుడి చేసేందుకు ఇలాంటి ప్రకటనలు.. ప్రచారాలు చేస్తుంది అంటూ నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.