కార్తికేయ 2 నుండి వాకౌట్ చేసిన మల్లు బ్యూటీ?

నిఖిల్ కెరీర్ లో కార్తికేయ సక్సెస్ ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సినిమా విజయంతో హీరోగా నిఖిల్ తన మార్కెట్ ను పదిలపరుచుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 20 కోట్ల పైచిలుకు వసూళ్లతో అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ప్రభంజనంతో దర్శకుడిగా చందూ మొండేటి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

కార్తికేయ ఈ దర్శకుడికి మొదటి సినిమా. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ పట్టాలెక్కింది. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా ముహూర్తం జరుపుకుంది. మరో రెండు వారాల్లో షూటింగ్ అనగా లాక్ డౌన్ కారణంగా బ్రేకులు పడ్డాయి. మొదటి సినిమాకు ఈ సీక్వెల్ కొనసాగింపు కాదని, అయితే అందులోలాగే మిస్టరీ అంశమొకటి సినిమాను డ్రైవ్ చేస్తుందని దర్శకుడు తెలిపాడు.

కార్తికేయ 2 లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు. నిఖిల్ సరసన ఫ్రెష్ ఫేస్ కావడంతో సెట్ అవుతుందని భావించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి అనుపమ వాకౌట్ చేసినట్లు సమాచారం. లాక్ డౌన్ సమయంలోనే ఈ విషయంపై మూవీ యూనిట్ కు హీరోయిన్ సమాచారమందించిందిట.

వాకౌట్ కు రీజన్ సినిమాలో తనకు ప్రాముఖ్యత లేకపోవడమేనని తెలుస్తోంది. కార్తికేయ చిత్రంలో కూడా హీరోయిన్ స్వాతికి అంత ప్రాముఖ్యత లేదు. సీక్వెల్ లో కూడా స్క్రిప్ట్ లో హీరోయిన్ ప్రాముఖ్యత తక్కువే అని అనుపమ వాకౌట్ చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.