కేజిఎఫ్ 2: అధీరా పార్ట్ ను పూర్తి చేసేసారట!

ప్రస్తుతం ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాలలో కేజిఎఫ్ చాప్టర్ 2 ప్రత్యేకమైంది. రెండేళ్ల క్రితం విడుదలైన మొదటి పార్ట్ ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో మనందరం చూసాం. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఒక కన్నడ సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. మొదటి పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రెండవ పార్ట్ పై అంతకు రెట్టించిన అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కేజిఎఫ్ చాప్టర్ 2 మరింత భారీగా ఉంటుందని ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పష్టం చేసిన విషయం తెల్సిందే. దానికి తగ్గట్లుగానే ఈసారి కాస్ట్ విషయంలో కూడా భారీ చేరికలు వచ్చాయి. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెల్సిందే.

సంజయ్ దత్ అధీరా పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా గురించి మొదటి పార్ట్ లో చిన్న బిల్డప్ ఉంది కానీ రెండవ పార్ట్ లో మెయిన్ విలన్ గా అధీరా పాత్ర ఉంటుంది. హీరో రాకీ భాయ్ కు ధీటైన పాత్రలో అధీరా పాత్ర కనిపిస్తుందని తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం అధీరా పాత్ర చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందట. ఈ లాక్ డౌన్ సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ పర్యవేక్షణలో అధీరా పాత్రకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.

ముందు దసరాకు సినిమా విడుదల ఉంటుందని ప్రకటించారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల వచ్చే ఏడాది మొదట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.