మరో క్రేజీ ఆఫర్‌ ను దక్కించుకున్న బేబమ్మ

మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అయిన ఉప్పెన సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉప్పెన సినిమా విడుదలకు ముందు అందులో నటించిన కృతి శెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా విడుదల కాకుండానే మూడు నాలుగు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. ఈ అమ్మడు తాజాగా మరో క్రేజీ ఆఫర్ ను దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బేబమ్మ అంటూ తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఆమె పేరును కలవరిస్తున్నారు. అందుకే ఆమెతో రొమాన్స్ కు రామ్‌ సిద్దం అయ్యాడు.

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. ఆ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్‌ గా ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాలున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ లో కృతి శెట్టి నటించబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించేందుకు నిర్మాతలు సిద్దం అవుతున్నారు. ఈ ఏడాది ఉప్పెనతో మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలతో కూడా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.