పాపం ఖుష్బూ.. సొంత పార్టీ నేతపైనే విమర్శలు

ఒక్కోసారి మనం మాట్లాడిన మాటలు మనకే ఎదురు తగులుతాయి. అందుకే ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలంటారు. ఇక నలుగురిలో మాట్లాడేటప్పుడైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులైతే అత్యంత జాగరూకతతో ఉండకపోతే ట్రోలింగులు తప్పవు. తాజాగా ప్రముఖ నటి ఖుష్బూ అనాలోచితంగా మాట్లాడి ఇబ్బందులుపాలయ్యారు. ప్రస్తుతం ఆమె బీజేపీ అభ్యర్థిగా తమిళనాడు లోని థౌజెండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ప్రచార సభలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయని, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలను గాలికొదిలేశాడని మండిపడ్డారు.

దీంతో ఆమె పక్కనే ఉన్న ఓ నేత మొహంలో రంగులు మారాయి. అయినా తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఖుష్బూ.. గత ఎమ్మెల్యేపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి ఖుష్బూ దగ్గరకు వచ్చి ఆమె చెవిలో ఏదో చెప్పడంతో పాపం ఖుష్బూకి ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే మరెవరో కాదు.. ఆ ప్రచార సభలో ఖుష్బూ పక్కనున్న వ్యక్తే. ఆయన పేరు సెల్వం. డీఎంకే నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ విషయం తెలియని ఖుష్బూ అతడిపైనే విరుచుకుపడటంతో సభకు వచ్చినవారంతా పెద్దపెట్టున నవ్వుతూ కేకలేశారు. దీంతో ఖుష్బూకి ఏం చేయాలో తెలియక ఇబ్బందిగా తన ప్రసంగాన్ని ముగించారు.