అయ్య‌య్యో…శ్రీ‌దేవి కూతురిని ఏడ్పిస్తారా?

అతిలోక సుందరి శ్రీదేవి అంటే ఆల్ ఇండియాకే అంద‌గ‌త్తె. అతిలోక సుంద‌రిగా యావ‌త్ భార‌త చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే పేరుగాం చారామె. కేవ‌లం శ్రీ‌దేవి కోసమో పదుల సంఖ్య‌లో సినిమా చూసే పిచ్చోళ్లు ఉండేవారంటే అతిశ‌యోక్తి కాదు. అంత గొప్ప మ‌హాన‌టి వారసురాలిగా తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తొలి సినిమాతోనే త‌ల్లిని మ‌రిపించి, ప్రేక్ష‌కుల‌ను మురిపించింది.

ఇదిలా ఉంటే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ వీడియో షేర్ చేసింది. అమ్మ‌, అక్క‌లా తాను అందంగా లేన‌ని, కొంద‌రు చేసిన హేళ‌న గురించి తీవ్ర ఆవేద‌న చెందుతూ పోస్ట్ చేసిన ఆ `క్వారంటైన్ టేప్స్` వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె ఏమ‌న్నారంటే…

“నేను 19 ఏళ్ల అమ్మాయిని. ఇంకా ఎదుగుతున్నా. కొందరు నన్ను అకారణంగా విమర్శిస్తుంటారు. నువ్వు అమ్మలా, అక్కలా లేవని వేలెత్తి చూపుతుంటారు. నాపై జోక్‌లు వేస్తుంటారు. ఇలాంటి విద్వేషపూరిత మాటలు వింటే మ‌న‌సు త‌ట్టుకోలేక పోతోంది. ఎంతో వేద‌న క‌లుగుతోంది. బాధగా ఉంటుంది. ఇలాంటి విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావ‌డం లేదు. నేనూ అందరిలాంటి అమ్మాయినే. ఈ విష‌యాన్ని ప్రజలకు చెప్పాలనిపిస్తుంది. ముందు మనల్ని మనం ఇష్టపడాలి. అప్పుడే ప్రజలు కూడా మనల్ని ఇష్టపడతారని అర్థమైంది” అంటూ ఖుషీ పేర్కొంది.

ఈ వీడియో చూసిన త‌ర్వాత త‌ల్లిలేని పిల్ల ఖుషీ ఆవేద‌న ప్ర‌తి ఒక్క మ‌న‌సును క‌దిలిస్తుంది. కోట్లాది మంది ఆరాధించే శ్రీ‌దేవి కూతురిని క‌ష్ట‌పెట్ట‌డం భావ్య‌మా? ఇక‌పై ఆమెను బాధ పెట్టేవాళ్ల మ‌న‌సు మారుతుంద‌ని ఆశిద్దాం.