సినిమా ప్లాప్ అయితే 2-3 రోజులు బయటకు రాను: మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ దూకుడు చూపిస్తున్నారు. కెరీర్ లో ఇప్పటి వరకు 27 సినిమాల్లో నటించిన మహేష్.. తాను నటించిన మూవీ ప్లాప్ అయితే మాత్రం చాలా బాధ పడతానని చెప్తున్నారు. ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోకి గెస్టుగా హాజరైన మహేష్ అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకోడానికి కారణం ఏంటని మహేష్ ని బాలయ్య అడిగారు. గ్యాప్ అనుకోకుండానే వచ్చిందిని.. అది తన లైఫ్ లో చాలా కష్టమైన పీరియడ్ అని మహేష్ చెప్పారు. ఏ సినిమా చేయాలో తెలియక అయోమయంలో పడ్డానని.. ఆ మూడేళ్లలో తనను తాను ఆవిష్కరించుకున్నానని అన్నారు.

”ఆ సమయంలో మా అమ్మమ్మ గారు చనిపోయారు. నమ్రత తల్లిదండ్రులు ఇద్దరూ క్యాన్సర్ తో చనిపోయారు. ఒక ఏడాది గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను. అది రెండేళ్లు రెండున్నరేళ్లు అయింది. నేను దానికి రిగ్రెట్ అవడం లేదు. ఆ టైములో ఎంతో నేర్చుకున్నాను. గౌతమ్ కూడా అప్పుడే పుట్టాడు. 2006 లో ‘పోకిరి’ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఇండస్ట్రీ హిట్ అది. ఆ తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని నేను కూడా ఒక కన్ఫ్యూజన్ పీరియడ్ లోకి వెళ్ళిపోయా. కానీ ఆ మూడేళ్ళలో చాలా నేర్చుకున్నాను. నన్ను నేను కరెక్ట్ చేసుకోడానికి ఆ మూడేళ్లు తీసుకున్నాను. ఆ తర్వాత ఇంక వెనక్కి తిరిగి ఆలోచించలేదు” అని తెలిపారు.

అదే సమయంలో ఇతర హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్.. కాంపిటేషన్ టెన్షన్ ఏమైనా ఉన్నాయా అని బాలయ్య ప్రశ్నించగా.. ”నేను ఏం పట్టించుకోలేదండి. మన మీద మనకు నమ్మకం ఉండాలి అంతే” అని మహేష్ బదులిచ్చారు. సినిమా ఫ్లాప్ తనను చాలా బాధిస్తుందనే విషయాన్ని బయటపెట్టిన మహేష్.. రెండు మూడు రోజులపాటు రూమ్ లో నుంచి బయటకురానని తెలిపారు. సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు.

”బేసిక్ గా సినిమా ఫ్లాప్ అయితే నాకు చాలా బాధ కలుగుతుంది. సినిమా ఆడకపోతే అందరికంటే ముందు నేనే విపరీతంగా బాధపడతాను. ఫ్లాప్ కు ఫస్ట్ నేనే బాధ్యుడ్ని అని ఫీల్ అవుతాను. ఎందుకంటే నా వల్లనే కదా డబ్బులు పోయాయి.. కథ నేను ఓకే చేసి ఉండకపోతే ఇలా జరిగేది కాదు కదా.. అందుకే ఫ్లాప్ కు మొదటి రెస్పాన్సిబిలిటీ నాదే. అందుకే సినిమా ఆడకపోతే 2-3 రోజులు రూమ్ నుంచి బయటకు రాను. ఆ ప్రాసెస్ లో తప్పు జరిగిపోయిందని అండర్ స్టాండింగ్ చేసుకొని.. దీన్నుంచి ఎలా బయటకు రావాలనేది ఆలోచిస్తాను” అని మహేష్ అన్నారు.

అయితేని ఫెయిల్యూర్స్ ని గుర్తిస్తే సక్సెస్ అవుతామని చెప్పిన మహేష్.. కథల విషయంలో ప్రతి నిర్ణయం తనదేనని.. కనీసం తన తండ్రి ప్రమేయం కూడా ఉండదని తెలిపారు. “బయట వాళ్ల మీద నేను ఎప్పుడూ ఆధారపడను. నా సబ్జక్ట్స్ ని నాన్నగారితో కూడా ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. ఏదైనా నేనే నిర్ణయం తీసుకుంటాను. తప్పయినా నాదే.. ఒప్పైనా నాదే. అలా ఉండాలనేదే నా ఫీలింగ్. రేపు మా అబ్బాయి కూడా అలానే ఉండాలి. నేను వాడ్ని సపోర్ట్ చేయను. ఫెయిల్యూర్స్ ని గుర్తిస్తే మనం సక్సెస్ అవుతామనేది నా ఫీలింగ్. నా కెరీర్ లో అదే జరిగింది” అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

ఇకపోతే మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మూడో మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదే క్రమంలో దిగ్గజ దర్శకుడు రాజమౌళితో మహేష్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు.