మహేష్ ఆ గ్యాప్ లో ఇంకోటి చేస్తాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య సినిమాల విషయంలో చాలా కచ్చితంగా ఉంటున్నాడు. ఏదైనా సినిమా ఒప్పుకున్నా కూడా సెట్స్ కి వెళ్ళేదాకా అది ఉంటుందా లేదా అని తెలియని పరిస్థితి. సుకుమార్ తో సినిమా, వంశీ పైడిపల్లితో సినిమా కచ్చితంగా ఉంటాయని అన్నారు. అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి. ఆ తర్వాతే అవి సైడ్ అయిపోయాయి. అందుకే సినిమా ముహూర్తం జరిగినా సెట్స్ కి వెళ్ళేదాకా మహేష్ తో సినిమా ఉంటుందా ఉండదా అన్న ట్రోలింగ్ నడుస్తోంది ఇప్పుడు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే పరశురామ్ తో సినిమాను పక్కా చేసుకోవచ్చు. అయితే మే 31కి లాంచ్ అంటున్నారు. అది ఉంటుందా ఉండదా అన్నది ఇంకా తెలియలేదు. ఇక ఈ మధ్యనే రాజమౌళి తన తర్వాతి సినిమా మహేష్ తోనే అని తేల్చి చెప్పిన సంగతి తెల్సిందే. ఆ చిత్రం 2022 లో మొదలవుతుంది. రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా రెండేళ్లు తెరకు దూరం కావాల్సిందే.

2022లో సినిమా అంటే పరశురామ్ తో సినిమా తర్వాత మరొకటి మహేష్ చేసే అవకాశముంది. అది ఏ సినిమా అన్నదానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. పరశురామ్ తో సినిమా అవ్వగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే అనిల్ రావిపూడితో కూడా సినిమా ఉండే అవకాశముంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మహేష్ కచ్చితంగా చేస్తాడని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.