రామాయణంలో మహేష్ నటించనున్నట్లు హింట్ ఇచ్చిన ప్రొడ్యూసర్..!

ఇతిహాస ‘రామాయణం’ నేపథ్యంలో 3డీ సినిమా రూపొందించడానికి అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్ – మధు మంతెన – నమిత్ మల్హోత్ర గత నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి మరియు ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ దర్శకత్వంలో ‘రామాయణం’ సినిమా తెరకెక్కనుందని చాన్నాళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. మూడు భాగాలుగా రూపొందే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2021లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించారు. అయితే కారణాలు తెలియదు కానీ ఇంతవరకు ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రభాస్ ‘ఆదిపురుష్’ – విజయేంద్ర ప్రసాద్ ‘సీత’ సినిమాలు లైన్ లోకి రావడంతో మెగా ప్రొడ్యూసర్ తలపెట్టిన రామాయణం ఆగిపోయిందనే ప్రచారం జరిగింది.

అయితే ఆ వార్తల్లో నిజం లేదంటూ నిర్మాతలు అప్పుడప్పుడు ‘రామాయణం’ ప్రాజెక్ట్ గురించి హింట్స్ ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు – బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ – దీపికా పదుకునే లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. రాముడిగా మహేష్.. రావణుడిగా హృతిక్.. సీత పాత్రలో దీపికా నటించనున్నారని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత మధు మంతెన ఓ ఇంటర్వ్యూలో మహేష్ ఇందులో నటించే అవకాశం ఉందనే విధంగా సమాధానం ఇచ్చారు. రామాయణం ప్రాజెక్ట్ లో మహేష్ – హృతిక్ – దీపికా భాగం కానున్నారా అనే వార్తలను నిర్మాత కంఫర్మ్ చేయలేదు.. అలాగని ఖండించలేదు.

చిన్న స్మైల్ ఇచ్చిన మధు మంతెన.. స్టార్ క్యాస్టింగ్ తో భారీ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని.. దీపావళికి అన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం రామాయణం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించిన మధు.. స్టార్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్టు కోసం పవర్క్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రొడ్యూసర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే రాముడి పాత్ర కోసం మహేష్ ని సంప్రదించినట్లు అర్థం అవుతోంది. మరి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో పెట్టిన మహేష్ బాబు.. పౌరాణిక పాత్ర చేయడానికి ఆసక్తి కనబరుస్తారో లేదో చూడాలి.