కాస్టింగ్ కౌచ్ పై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. నటిగా..నిర్మాతగా..సింగర్ గా..హోస్ట్ గా పరిశ్రమలో రాణిస్తుంది. వెండి తెరపై కంటే బుల్లి తెరపైన లక్ష్మి మంచి సక్సెస్ అయింది. అలాగని వెండి తెరని విడిచిపెట్టలేదు. అవకాశం వచ్చినప్పుడు అక్కడా లక్ష్మి సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. తాజాగా మంగళవారం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచు లక్ష్మి కాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు.

“ఓ పెద్దింటి నుంచి వచ్చాను. మోహన్ బాబు కుమార్తెను అయినా నాకు కాస్టింగ్ కౌచ్ లాంటి దురదృష్ట కర సందర్భాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో నా రక్తం మరిగింది. అలాంటి పరిస్థితులు కొందరు తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇది సర్వసాధారణమైన సమస్యలా మారిపోయింది. అమ్మాయిలు అన్ని దశలలోనూ..అన్ని రకాల వృత్తుల్లోనూ ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఐటీ..బ్యాకింగ్..ఫిల్మ్ ఇలా ఏ రంగాన్ని టచ్ చేసినా బాధిత మహిళలు కనిపిస్తున్నారు.

`మీటూ ఉద్యమం` మొదలైన సమయంలో ఎంతో మంది బాధితులు తమపై జరిగిన దాడుల గురించి చెప్పుకొచ్చారు. అది మంచి పరిణామం ` అని అన్నారు. “మొదట్లో నాకున్న బ్యాక్ గ్రౌండ్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుని గట్టి నమ్మకంతో ఉండేదాన్ని. కానీ కొందరు నిర్ధాక్షిణ్యంగా ఉన్నారు. ఎవరూ న్యాయంగా…నీతిగా..నిజాయితీగా దయగా కనిపించడం లేదు` అన్నారు.

ఇంకా ఆమె ఎదుర్కున్న బాడీ షేమింగ్ గురించి వెల్లడించింది. “నేను చాలాసార్లు ట్రోలింగ్ కి గురయ్యాను. నన్ను అందంగా ఉన్నప్పుడు బాగోలేదని..సన్నగా ఉన్నప్పుడు బాగా సన్నగా ఉన్నానని కామెంట్లు చేసి ట్రోల్ చేసారు. అలాంటి వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. మీరు ఎప్పటికి ప్రజల్ని మెప్పించే వారు కాలేరు. దయచేసి మీ గురించి మీరు ముందు తెలసుకోండి. ఇది అందరికీ మంచిది. మొదట్లో ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకునే దాన్ని. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేసా.

ఆ తర్వాతనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరో ఏదో అన్నారని దానిపై రాద్దాంతం చేయను. అయితే దేనికైనా లిమిట్ ఉంటుంది. అలా క్రాస్ చేస్తేనే సమస్యలు వస్తాయని“ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవలే మోహన్ బాబు కూడా ట్రోలింగ్ విషయంలో స్పందించిన సంగతి తెలిసిందే. ఓ ఇద్దరు హీరోలు పని గట్టుకుని తన కుటుంబాన్ని టార్గెట్ చేసి ట్రోల్ చేయిస్తున్నారని ఆరోపించారు.

ఇకపై ఊరుకునేది లేదని..కోర్టులో కేసులు.. దావాలు వేస్తామని హెచ్చరించారు. ఇక మంచు లక్ష్మి చివరి సారిగా `పిట్ట కథలు` సినిమాలో నటించింది. ఆ సినిమా నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది లేదు. బుల్లి తెరపైనా చివరిగా `ఆహా భోజనంబు` షోకి హోస్ట్ గా వ్యవహరించింది.