విషాదం నుంచి కోలుకున్న‌ చిరంజీవి భార్య

క‌న్న‌డ యాక్ట‌ర్ చిరంజీవి సర్జా ఆక‌స్మిక మ‌ర‌ణం మిగిల్చిన విషాదం నుంచి ఆయ‌న భార్య మేఘ‌నా నెమ్మ‌దిగా కోలుకుంది. తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో త‌న ఫ్యామిలీతో సంతోషంగా క‌లిసి ఉన్న ఫొటోల‌ను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అంద‌రి ముఖాల్లో చిరు న‌వ్వు తొణిక‌స‌లాడుతోంది.

క‌న్న‌డ న‌టుడు చిరంజీవి స‌ర్జా చిన్న వ‌య‌సులో గుండె పోటుతో మృతి చెంది…అభిమానుల‌తో పాటు కుటుంబ స‌భ్యుల‌కు తీర‌ని శోకాన్ని మిగిల్చాడు. ఆయ‌న భార్య మేఘ‌నారాజ్ ప్ర‌స్తుతం నాలుగు నెల‌ల గ‌ర్భిణి. చిరంజీవి భార్య మేఘ‌నా త‌న ఇంట్లో సంస్మ‌ర‌ణ స‌భ ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు కుటుంబ స‌భ్యులంతా హాజ‌రై చిరంజీవి ఫొటో ఎదుట కూచొని ఫోజులిచ్చారు.

ఈ ఫోటోల‌ని మేఘ‌నా షేర్ చేయ‌డంతో పాటు చిరుతో త‌న గాఢ‌మైన ప్రేమానుబంధాన్ని ప్ర‌తిబింబించేలా భావాల‌ను వ్య‌క్త ప‌రిచారు. ఆమె అంత‌రంగానికి అక్ష‌ర రూపం ఇచ్చారు.

“నా ప్రియ‌మైన చిరు…నువ్వు ఉంటే ఓ పండగ‌ను త‌ల‌పించేది. అయినా మేము బాధ‌లో ఉండ‌డం నీకు న‌చ్చ‌దు. నా న‌వ్వు వెనుక కార‌ణం నువ్వే. అదే నువ్వు నాకిచ్చిన అమూల్య‌మైన వ‌స్తువు. ప్ర‌తి రోజు నీకు న‌చ్చిన విధంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. నీ న‌వ్వు, చిలిపిత‌నం, నీ నిజాయితి ముఖ్యంగా అంద‌రు క‌లిసి ఉండాల‌నుకోవ‌డం. ఈ గొప్ప ల‌క్ష‌ణాలే నీపై మాకు ఎల్ల‌ప్పుడు ప్రేమ ఉండేలా చేస్తుంది” అని మేఘ‌నా త‌న పోస్ట్‌లో రాసుకొచ్చారు. మేఘ‌న త‌న భ‌ర్త కోసం ఏం రాసినా హృద‌యానికి హ‌త్తుకునేలా ఉంటుంది. అందుకే ఆమె తాజా పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.