ఎమ్మెల్యే రఘునందన్ రావు చుట్టూ వివాదం.. మహిళ ఆత్మహత్యాయత్నం..

ఇటివల దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బీజేపీ నాయకుడు రఘునందన్ రావు ఎన్నికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఓ మహిళ ఆత్మహత్యాత్నానికి పాల్పడింది. దీంతో ఈ అంశం తీవ్ర కలకలం రేపుతోంది. రఘునందన్‌రావు తనపై 2007లో అత్యాచారం చేశారని మెదక్‌ జిల్లాకు చెందిన రాధారమణి గతంలో సంచలన ఆరోపణలు చేసారు. ఆమె ఆరోపణలను రఘునందన్ అప్పట్లోనే ఖండించారు.

ప్రస్తుతం రాధా రమణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడట తీవ్ర సంచలనం రేపుతోంది. ఇందుకు కారణాలేమిటో తెలియరాలేదు. తనను రఘునందన్ రావుతో పాటు మరికొందరు వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. మాత్రలు అతిగా తీసుకున్నారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రామచంద్రాపురం పోలీసులు ఆమెకు రహస్యంగా చికిత్స చేయించినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తనకు న్యాయం జరగడంలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఈ విషయమై ఈ ఏడాది ప్రారంభంలో రాధా రమణి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రాన్ని కూడా అందజేశారు. 2007లో రఘునందన్‌రావు తన ఆఫీసుకు పిలిపించుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి ఒడిగట్టారని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని ఆమె సజ్జనార్ ను కోరారు. అదే ఫిర్యాదులో తనకు ప్రాణహాని ఉందని కూడా పేర్కొనడం అప్పట్లో సంచలనం రేపింది.