వరస ప్రాజెక్టులతో నాగ చైతన్య హల్చల్

ఈ లాక్ డౌన్ ను అక్కినేని నాగ చైతన్య సరిగ్గా ఉపయోగించుకున్నాడనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు చైతన్య. వాటి వివరాల్లోకి వెళితే.. ముందుగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేయనున్నాడు. గతంలో మనం సినిమాకు వీరిద్దరూ కలిసి పనిచేసారు. ఇప్పుడు విక్రమ్ కుమార్ కథ నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి చైతన్య అంగీకరించాడు. థాంక్యూ అనే టైటిల్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.

దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీని తర్వాత మోహన్ కృష్ణ ఇంద్రగంటి చెప్పిన కథకు కూడా చై పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.

ఇక రీసెంట్ గా నందిని రెడ్డి నాగ చైతన్యను కలిసి చెప్పిన స్క్రిప్ట్, తనకు తెగ నచ్చేయడంతో వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. స్వప్న సినిమాస్ ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించనుంది. ఈ మూడు ప్రాజెక్టులతో నాగ చైతన్య ఫుల్ బిజీగా ఉండనున్నాడు.

ప్రస్తుతం చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది.