ఆ లెక్కలన్నీ `లవ్ స్టోరి` సరిచేస్తుందా?

సరిగ్గా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన సమయంలో చెప్పుకోదగ్గ రిలీజ్ లు మూడే మూడు. అవే `సీటీమార్`..`రాజ రాజ చోర`..`ఎస్ ఆర్ కళ్యాణమండపం`. ముందుగా ఎస్.ఆర్ కళ్యాణ మండపం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రం. రిలీజ్ తర్వాత మంచి టాక్ వచ్చినా సెకెండ్ వేవ్ భయంతో జనాలు థియేటర్ కి పెద్దగా వెళ్లలేదు. కొత్త నటీనటుల కారణంగాను ఫలితంపై ప్రభావం పడింది. అటుపై శ్రీ విష్ణు నటించిన `రాజ రాజ చోర` కు విమర్శకుల ప్రశంసలు దక్కినా థియేటర్ కి వెళ్లే ప్రేక్షకులు కరువయ్యారు. ఆ రకంగా ఆ సినిమాకు దెబ్బ పడింది. ఇక గోపీచంద్ నటించిన `సీటీమార్` మాత్రం ఆ రెండిటికంటే ఉత్తమమైన ఫలితాలే సాధించింది.

గోపీచంద్ కెరీర్ లో నే తొలి రోజు భారీ వసూళ్లు తెచ్చిన చిత్రంగా రికార్డు సాధించింది. మీడియం రేజ్ హీరో కావడం.. మాస్ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఉన్న హీరో కావడంతో సీటీమార్ వైపు ప్రేక్షకులకు ఓ చూపు చూసారు. అయితే ఆ స్పీడ్ వీకెండ్స్ లో అంతగా పుంజుకున్నట్లు కనిపించలేదు. ఏదేమైనా సిటీమార్ కాస్త ఉత్సాహపరించిందనే చెప్పాలి. అయితే హైదరాబాద్..ఓవర్సీస్ లో వసూళ్లు మందగమనం కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ లెక్కలన్నింటిని సరిచేయాల్సి బాధ్యత `లవ్ స్టోరీ` పై ఉంది. నాగచైతన్య-సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ములా దర్శకత్వంలో తెరకెక్కిన `లవ్ స్టోరీ` సెప్టెంబర్ 24న థియేటర్లోకి వస్తోంది.

ఆడియన్స్ లో చై-సాయి పల్లవి కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది. ఫ్యామిలీ సహా అన్ని వర్గాల ఆడియన్స్ ఆయన సినిమాలకు కనెక్ట్ అవుతారు. పైగా డీసెంట్ లవ్ స్టోరీ కావడం..`ఫిదా` తర్వాత కమ్ములా నుంచి వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఎగ్జైట్ మెంట్ కనిపిస్తుంది. శేఖర్ కమ్ముల గత సినిమా వసూళ్లు పరిశీలిస్తే హైదరాబాద్ సహా ఓవర్సీస్ లో ప్రత్యేకంగా మంచి లాభాలు తెచ్చిన సినిమాలున్నాయి. ఆ రకంగా తాజా పరిస్థితుల్లోనూ లవ్ స్టోరీకి గనుక మంచి మౌత్ టాక్ వస్తే ఆ రెండు ప్రాంతాల నుంచి వసూళ్ల సునామీ తప్పదనే టాక్ వినిపిస్తోంది. కరోనా భయం కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యం సినిమాకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.