నాగశౌర్యతో గొడవ పై స్పందించిన సాయిపల్లవి!

సాయిపల్లవికి తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే తెలుగు నుంచి ఆమెకి వచ్చిన అవకాశాలు ఎక్కువ .. సక్సెస్ రేటు ఎక్కువ. సాయిపల్లవి నటన ఒక ఎత్తయితే ఆమె డాన్స్ ఒక ఎత్తు. ఆమె డాన్స్ యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటే సహజమైన ఆమె నటన ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంటుంది. అందువలన అన్ని వర్గాల ప్రేక్షకులు సాయిపల్లవిని అభిమానిస్తుంటారు. ఇక సాయిపల్లవి కథాకథనాలకు .. తన పాత్రకి చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. అవి మాత్రమే ఒక సినిమా ఎక్కువ కాలం నిలబడటానికి కారణమవుతాయని ఆమె బలంగా నమ్ముతుంటుంది.

సాధారణంగా క్రేజ్ ఉన్నప్పుడే దానిని క్యాష్ చేసుకోవాలనే అభిప్రాయంతో కొంతమంది ఉంటారు. కానీ సాయిపల్లవి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. కథ .. తన పాత్ర నచ్చకపోతే ఎంత పారితోషికాన్ని ఆఫర్ చేసినా ఆమె తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినా తనకి నచ్చని యాడ్స్ చేయడానికి ఆమె నో చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడుతూ వచ్చాయి. సాయిపల్లవి వ్యక్తిత్వం కూడా ఆమెకి మరికొంత మంది అభిమానులను సంపాదించి పెట్టింది.

సాయిపల్లవితో కలిసి నటించిన చాలామంది హీరోలు ఆమె నటన గురించి .. ఆమె డాన్స్ గురించి .. వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడినవారే. ఆమెతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినవారే. అయితే నాగశౌర్య మాత్రం ఆమె విషయంలో ఒక సందర్భంలో అసహనాన్ని .. అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘కణం’ సినిమా సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆ విషయాన్ని గురించి సాయిపల్లవి అప్పుడు ఏమీ మాట్లాడలేదు. అనేక రకాల ఊహాగానాలు షికారు చేసినా ఆమె పట్టించుకోలేదు.

కానీ తాజాగా ఓ సందర్భంలో ఈ ప్రస్తావన రావడంతో ఆమె స్పందించింది. నాగశౌర్య నాలో నచ్చని గుణాన్ని గురించి బయటికి చెప్పారు .. ఆ విషయాన్ని నేను పాజిటివ్ గానే తీసుకున్నాను. నా వలన ఆయనకి ఇబ్బంది కలిగి ఉంటే అది తప్పకుండా నాకు బాధ కలిగించే విషయమే అవుతుంది. ఆయన పట్ల నాకు ఎప్పుడూ గౌరవమే ఉంటుంది. ఈ సమాధానంతో ఆయన సంతృప్తి చెందుతారనే ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో ఆమె తాజా చిత్రంగా ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది.