క్రిష్ నాగబాబుకు ఫోన్ చేసి..

ఓవైపు ఫ్యాన్ వార్స్ వద్దని హీరోలు పదే పదే విజ్నప్తి చేస్తూనే ఉంటారు. కానీ అభిమానుల్లో మాత్రం మార్పు రాదు. తాము శత్రువులుగా భావించే హీరోలు కలిసి తిరుగుతున్నా.. స్నేహంగా ఉంటున్నా.. అభిమానులు మాత్రం ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ అభిమానుల తీరు ఇలాగే ఉంది. ఇటు చిరు.. అటు బాలయ్య ఒకరి గురించి ఒకరు పాజిటివ్ గా మాట్లాడుతున్నా.. అవతలి సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నా.. అభిమానులు మాత్రం పరస్పర ధ్వేష భావంతో రగిలిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా యుద్ధాలకు దిగుతున్నారు.

ఈ పరిస్థితి చూస్తుంటే తనకు సిగ్గేస్తోందని.. ట్విట్టర్ ఓపెన్ చేయాలంటేనే భయమేస్తోందని అంటున్నాడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ దర్శకుడు క్రిష్. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ విషయమై క్రిష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. హీరోలు పిలుపునిస్తున్నా.. హీరోలు కూడా మంచి మాటలు చెబుతున్నా అభిమానులు మారకపోవడం ఏంటని క్రిష్ ప్రశ్నించాడు.

తాను ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వేడుకలో అన్న ‘ఖబడ్దార్’ అనే మాటపై వివరణ ఇచ్చినప్పటికీ అభిమానుల్లో మార్పు రాలేదన్నాడు క్రిష్. తాను ఆ వ్యాఖ్యలు చేయడం ఆలస్యం.. దుష్ప్రచారం జరగడంతో కంగారు పడి తాను వెంటనే చిరంజీవి తమ్ముడు నాగబాబుకు ఫోన్ చేసి.. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పకున్నట్లుగా క్రిష్ వెల్లడించాడు. చిరంజీవి.. బాలయ్య సినిమాలపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడమేనంటూ నెగెటివ్ కామెంట్స్ చేసే అభిమానులకు చురక అంటించాడు క్రిష్.