డ్రగ్స్‌ రచ్చ: ఎన్‌సిబి లిస్ట్‌లో మహేష్‌ భార్య నమ్రత పేరు.?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సతీమణి, ఒకప్పటి హీరోయిన్‌ నమ్రతా శిరోద్కర్‌ పేరు బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో తెరపైకొచ్చింది. నేషనల్‌ మీడియా, నమ్రత పేరుతో బ్రేకింగ్‌ న్యూస్‌లు ఊదరగొట్టేస్తోంది. తెలుగు మీడియా సైతం, ఈ విషయాన్ని ‘బద్దలగొట్టేస్తోంది’.! బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ అనుమానాస్పద మరణంతో తెరపైకొచ్చిన డ్రగ్స్‌ కేసుని విచారించిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) ఇప్పటికే బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిని అరెస్ట్‌ చేసిన విషయం విదితమే.

తాజాగా ఈ కేసుతో సంబంధం వుందంటూ జయ సాహా సహా మరికొందరికి నోటీసులు పంపింది. పలువురు సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు నడిపిన జయ సాహాని డ్రగ్స్‌ డీలర్‌గా అనుమానిస్తున్నారు. ఈ జయ సాహాకి చెందిన వాట్సాప్‌ లిస్ట్‌లో నమ్రతా శిరోద్కర్‌ పేరు కన్పించిందంటూ నేషనల్‌ మీడియా, ఇందుకు సంబంధించిన ‘వాట్సాప్‌ స్క్రీన్‌ షాట్‌’ని ప్రచారంలోకి తెచ్చింది. సా

రా అలీ ఖాన్‌, దీపికా పడుకొనే, కరిష్మా కపూర్‌, దియా మీర్జాతోపాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి కూడా ఈ డ్రగ్స్‌ కేసుతో లింకులున్నాయని నేషనల్‌ మీడియా కోడై కూస్తోంది. అయితే, తనపై మీడియాలో వస్తున్న కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆల్రెడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందనుకోండి.. అది వేరే సంగతి.

నమ్రతా శిరోద్కర్‌తోపాటు పలువురు టాలీవుడ్‌ హీరోయిన్లు, పలువురు హీరోలకి సైతం ‘ఎన్‌సిబి’ సమన్లు పంపబోతోందని నేషనల్‌ మీడియా చెబుతోంది. టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం ఇదే కొత్త కాదు. గతంలో ఓ ప్రముఖ హీరో సోదరుడు డ్రగ్స్‌తో రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కేశాడు. అప్పట్లో ఆ ఘటన పెను సంచలనమైంది. ఆ తర్వాత, కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖుల్ని తెలంగాణ ఎక్సయిజ్‌ ‘సిట్‌’, డ్రగ్స్‌ కేసులో విచారించిన విషయం విదితమే.

ఏదిఏమైనా, మహేష్‌ సతీమణి నమత్రా శిరోద్కర్‌ పేరు ప్రచారంలోకి రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ ఉలిక్కి పడింది. ఈ విషయమై ఎన్‌సిబి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి వుంది.