ధూళిపాళ్ల తప్పేంటో చెప్పాలి: లోకేశ్

సంగం డెయిరీ విషయంలో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ధ్వజమెత్తారు. ఏపీలోని పాడి పరిశ్రమను గుజరాత్ కు అమ్మేందుకు వైసీసీ సర్కారు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. సంగం డెయిరీ కేసులో బెయిల్ పై విడుదలైన ఆ సంస్థ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను లోకేశ్ బుధవారం పరామర్శించారు. విజయవాడలోని ధూళిపాళ్ల ఇంటికి వెళ్లి కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సంగం డెయిరీ విషయంలో ధూళిపాళ్ల చేసిన తప్పేంటో చెప్పాలని సవాల్ చేశారు.

పాడి రైతులకు లీటరుకు రూ.4 ఎక్కువ ఇవ్వడం.. ఆస్పత్రి ఏర్పాటు చేసిన రైతులకు 50 శాతం రాయితీతో వైద్యం అందించడమే ఆయన చేసిన తప్పా? అని ప్రశ్నించారు. రైతుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి ధూళిపాళ్ల అని.. ప్రజల తరఫున పోరాడుతున్న టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఒంగోలు డెయిరీని ఇప్పటికే అమూల్ కు అప్పగించారని, ఇదే తరహాలో ఏపీ పాడి పరిశ్రమను గుజరాత్ కు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఓవైపు కరోనాతో ప్రజలు చనిపోతున్నా.. సీఎం జగన్ కనీసం సమీక్ష కూడా జరపకుండా టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.