కుటుంబంతో కలిసి గోవాకు నయన్‌- విఘ్నేశ్‌ ట్రిప్‌!

ప్రేమపక్షులు నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ ప్రస్తుతం హాలిడే మూడ్‌లో ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా జంటగా వెకేషన్‌కు వెళ్లే ఈ సెలబ్రిటీ కపుల్‌ ఈసారి తమ కుటుంబాలను సైతం ఇందులో భాగస్వామ్యం చేశారు. అంతా కలిసి గోవాకు వెళ్లి ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన విశేషాలను విఘ్నేశ్‌ శివన్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇక మంగళవారం నయన్‌ తల్లి ఒమనా కురియన్‌ పుట్టినరోజు సందర్భంగా దగ్గరుండి కేక్‌ కట్‌ చేయించిన ఫొటోను షేర్‌ చేశాడు. ‘‘హ్యాపీ బర్త్‌డే.. నా ప్రియమైన అమ్మూ మిసెస్‌ కురియన్‌’’అంటూ ప్రేమను కురిపించాడు. దీంతో నెటిజన్ల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా ఓ ప్రైవేట్‌ రిసార్టులో నిరాండబరంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలో నయనతార, విఘ్నేశ్‌, ఒమనా కురియన్‌తో పాటు విఘ్నేశ్‌ తల్లి కూడా ఉన్నారు. ఇక అంతకుముందు తన తల్లి స్విమ్మింగ్‌ ఫూల్‌లో దిగి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను పంచుకున్న ఈ దక్షిణాది డైరెక్టర్‌.. ‘‘అమ్మ ముఖంపై వచ్చే చిరునవ్వు మన హృదయంలోని సంతోషాన్ని ప్రతిబింబిస్తుంది. తల్లిదండ్రులను సంతోషపెట్టడం కంటే మించిన సంతృప్తి, పరిపూర్ణత మరే ఇతర విషయాల్లోనూ మనకు లభించదు. జీవితానికి ఉన్న గొప్ప లక్ష్యం ఏమిటంటే వాళ్లను ఆనందంగా ఉండేలా చేయడమే’’ అంటూ ఉద్వేగపూరిత పోస్టు షేర్‌ చేశాడు.

కాగా లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార, కథా రచయిత, డైరెక్టర్‌గా విఘ్నేష్‌ తమ తమ రంగాల్లో దూసుకుపోతూ కెరీర్‌పై దృష్టి సారిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు. లవ్‌బర్డ్స్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ ప్రేమజంట పెళ్లి చేసుకుంటే చూడాలని భిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఇరు కుటుంబాలు కలిసి ఓనమ్‌ జరుపుకోవడం.. ఇప్పుడు అంతా కలిసి ట్రిప్‌కు వెళ్లడంతో త్వరలోనే నయన్‌- విఘ్నేశ్‌ వివాహానికి ముహూర్తం ఖరారు కానుందంటూ కామెంట్ల రూపంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.