‘కాళ్లకు చెప్పులున్నట్టు గుర్తించలేదు’ తిరుమల వివాదంపై విఘ్నేశ్ శివన్ లేఖ

ఇటివలే పెళ్లి చేసుకున్న నయనతార, విఘ్నేశ్ శివన్ గురువారం తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే.. ఆ వెంటనే తిరుమల మాడ వీధుల్లో కాళ్లకు చెప్పులతో తిరిగి వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. వారిపై చర్యలకు టీటీడీ సిద్ధమైంది. దీంతో విఘ్నేశ్ శివన్ క్షమాపణ కోరుతూ ఓ లేఖ విడుదల చేశారు.

‘మేము తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలని భావించినా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. అయితే.. పెళ్లైన వెంటనే మా ఇష్ట దైవమైన వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చాం. మా పెళ్లి తిరుమలలోనే జరిగిందనే భావన జీవితాంతం గుర్తుంచుకునేందుకు ఆలయం వెలుపల ఫొటోషూట్ చేసుకున్నాం. ఆక్రమంలో మా కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాం. దేవుడిపై మాకు ఎంతో నమ్మకం ఉంది. నెలరోజుల్లో 5సార్లు స్వామిని దర్శించుకున్నాం. మేమెంతో ఆరాధించే స్వామిని అవమానించాలని ఇలా చేయలేదు. తెలియక చేసిన తప్పుకు దయచేసి మమ్మల్ని క్షమించండి’ అని లేఖలో పేర్కొన్నారు.

మాడవీధుల్లో పాదరక్షలతో తిరగడం.. అనుమతి లేకుండా ఫొటోషూట్ నిర్వహించడంపై నయనతారకు నోటీసులు ఇస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.