మాట్లాడేందుకు మొదటి సారి ఇబ్బంది పడుతున్నాః ఎన్టీఆర్‌

కీరవాణి తనయుడు సింహా హీరోగా రూపొందిన తెల్లవారితే గురువారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎన్టీఆర్‌ గెస్ట్‌గా వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది. తన కళ్ల ముందు పెరిగిన సింహా మరియు భైరవలు ఇలా సిమాలు చేస్తూ ఉంటే నాకు ఆనందంతో మాటలు రావడం లేదు. మొదటి సారి నేను మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నాను అన్నాడు. నా ఇద్దరు కొడుకులు అభయ్.. భార్గవ్‌ లు కూడా పెద్ద వారు అయ్యి ఏదైనా రంగంలో పేరు తెచ్చుకుంటే ఆ సమయంలో నేను మాట్లాడలేను. కేవలం మనసులో ఆనందం మాత్రమే కలుగుతుంది.

ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. సింహా మరియు భైరవలు సక్సెస్ అయ్యేందుకు పడుతున్న తపన మరియు కష్టం చూస్తుంటే ముచ్చటేస్తుంది. తప్పకుండా వారిద్దరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తన పిల్లల మాదిరిగా వారిద్దరిని పరిగణిస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళి మరియు కీరవాణిల ఫ్యామిలీలు నాకు దేవుడు ఇచ్చిన కుటుంబం అంటూ చెప్పుకొచ్చాడు. వారి కుటుంబ వేడుకకు నేను ప్రత్యేకంగా గెస్ట్‌ ను ఏమీ కాదు అన్నాడు.