తారక్ – త్రివిక్రమ్ కాంబోలో పాన్ ఇండియా మూవీ.. నిర్మాత క్లారిటీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో వీరిద్దరూ కలిసి మరో మూవీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్త ప్రోడక్ట్ గా ‘NTR30’ ప్రాజెక్ట్ కు అధికారిక ప్రకటన వచ్చింది.

దీనికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. నటీనటులు సాంకేతిక నిపుణులను కూడా ఎంపిక చేసారని వార్తలు వచ్చాయి. అయితే మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్తుందనుకుంటున్న సమయంలో.. ఎవరూ ఊహించని విధంగా ‘తారక్ – త్రివిక్రమ్’ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు ప్రకటించి మేకర్స్ అందరికీ షాక్ ఇచ్చారు.

ఈ క్రమంలో కొరటాల శివతో ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని ప్రకటించడం.. మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన హ్యటిక్ మూవీని అనౌన్స్ చేయడం జరిగిపోయాయి. కానీ ఇంతవరకు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అవడానికి కారణాలేంటనేవి బయటకు రాలేదు. అయితేదర్శక హీరోల మధ్య మనస్పర్థలు వచ్చాయని.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఈ కాంబోలో మరో ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదని గుసగుసలు వినిపించాయి.

త్రివిక్రమ్ ‘భీమ్లా నాయక్’ మీద దృష్టి పెట్టి ఈ సినిమాని లైట్ తీసుకోవడం వల్లనే ఇలా జరిగిందని.. ఇలా రకరకాల రూమర్స్ వచాయి. ఈ నేపథ్యంలో సితార నిర్మాత సూర్యదేవర నాగవంశీ తాజాగా ఎన్టీఆర్ సినిమా మీద స్పందించారు. ‘డీజే టిల్లు’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వలేదని వెల్లడించి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.

ఎన్టీఆర్ తో సినిమా వదిలేసుకోలేదని.. వాయిదా వేసుకున్నామని యువ నిర్మాత అన్నారు. ”తారక్ అన్నతో చాలా పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే వివరాలు చెబుతాం. డైరెక్టర్ గారు చాలా పెద్ద స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ గారు అనుకున్న సబ్జెక్ట్ అలాంటిది. తారక్ అన్నకు చాలా బాగా సూట్ అవుతుంది. దీన్ని ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ ఫిలింగా చేస్తాం” అని నాగవంశీ చెప్పుకొచ్చారు.

దీంతో త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని.. ఇద్దరూ ఇప్పటికీ మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నారని అర్థం అవుతోంది. అంతేకాదు త్వరలో వీరిద్దరూ కలిసి పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమా చేయబోతున్నారనే క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం ఇద్దరూ బిజీగా ఉన్నారు కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి సమయం పట్టే అవకాశం ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసిన ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ – బుచ్చిబాబు వంటి దర్శకులతో వర్క్ చేయనున్నారు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే మహేష్ బాబుతో SSMB28 చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.