బాలయ్య 103వ సినిమా పూరీతోనే..

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ.. వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. గత ఏడెనిమిదేళ్లలో ఒక్క ‘టెంపర్’ మినహాయిస్తే పూరికి హిట్టే లేదు. అది కూడా అతడి సొంత కథ కాదు.

ఈ నేపథ్యంలోనే బాలయ్య పూరికి ఛాన్సివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐతే బాలయ్య ఇచ్చిన ఈ అవకాశాన్ని పూరి సద్వినియోగం చేసుకోలేదు. తన మూస కథల నుంచి బయటికి రాలేదు. తనకు అలవాటైన మాఫియా కథనే వడ్డించాడు. బాలయ్య అభిమానుల్ని కొంతమేర ఈ సినిమా అలరించినా.. ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఇది చేదు అనుభవాన్నే మిగిల్చేలా ఉంది.

‘పైసా వసూల్’ విషయంలో వేళ్లన్నీ పూరి వైపే చూపిస్తున్నాయి. మంచి అవకాశాన్ని వృథా చేసుకున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు పూరి. అదే సమయంలో పూరికి ఎందుకు ఛాన్సిచ్చాడంటూ బాలయ్యనూ విమర్శిస్తున్నారు. ఐతే ‘పైసా వసూల్’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ పూరితో మరో సినిమా చేయడానికే బాలయ్య ఫిక్సవడం విశేషం. ఈ విషయాన్ని పూరీనే స్వయంగా వెల్లడించాడు.

‘పైసా వసూల్’ విడుదలకు ముందే ఈ విషయంలో బాలయ్య కమిట్మెంట్ ఇచ్చినట్లు చెప్పాడు. ‘పైసా వసూల్’ ఫలితం వచ్చే వరకు ఆగుదామని బాలయ్యతో తాను అన్నప్పటికీ.. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా తన 103వ సినిమాకు నువ్వే దర్శకుడంటూ బాలయ్య స్పష్టం చేశాడని.. ఆయన కోసం కథ కూడా సిద్ధమవుతోందని పూరి తెలిపాడు. తన కొడుకు ఆకాశ్‌తో తన తర్వాతి సినిమా ఉంటుందని పూరి వెల్లడించాడు.