కేటీఆర్ పటాభిషేకం ముహూర్తం చెప్పిన డిప్యూటీ స్పీకర్‌

తెలంగాణ కొత్త సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గరకు వచ్చిందని ఇప్పటికే పలువురు మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్న విషయం తెల్సిందే. తాజాగా డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు మరో అడుగు ముందుకు వచ్చి కేటీఆర్‌ సీఎం అయ్యే రోజులు దగ్గరకు వచ్చాయని అన్నాడు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయం పూర్తి అయ్యి ప్రారంభం అయిన తర్వాత ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ బాధ్యతలు తీసుకుంటాడు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. పద్మారావు మాటల ప్రకారం చూస్తే ఈ ఏడాదిలోనే కేటీఆర్‌ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.

2018 ఎన్నికల సమయంలోనే కేటీఆర్‌ కు ముఖ్య మంత్రి పదవి ఇచ్చి 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ పోటీ చేస్తాడని ప్రచారం జరిగింది. కాని అదంతా ఒట్టి పుకారే అంటూ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్‌ మనసులో కొత్త ఆలోచన వచ్చిందట. ఈ ఏడాది కేటీఆర్‌ ను సీఎంగా ప్రకటించి ఎన్నికలకు కేటీఆర్‌ సారధ్యంలోనే వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ కు బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతుంది. ఈసమయంలో కేటీఆర్‌ ను రంగంలోకి దించకుంటే రాబోయే ఎన్నికల్లో ఫలితం తారు మారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే మెల్లగా కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ నాయకులతో చెప్పిస్తున్నారు. అందులో భాగంగానే పద్మారావు మాట్లాడుతూ కేటీఆర్ కాబోయే సీఎం అన్నాడు.