ఏపీ రోడ్లపై జనసేనాని శ్రమదానం.. నోటికి కాదు, రోడ్లకు పని చెప్పండి.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. రెండున్నరేళ్ళుగా రాష్ట్రంలో రోడ్లు నాశనమైపోతే, రోడ్లు బాగు చేస్తామంటూ పబ్లిసిటీ స్టంట్లతో సరిపెడుతూ, రోడ్లను నరకానికి కేరాఫ్ అడ్రస్‌లుగా మార్చేసిన వైఎస్ జగన్ సర్కార్.. ఈ నెల 2న రోడ్ల కోసం శ్రమదానం చేసేందుకు రానున్న దరిమిలా.. ఈలోగా అయినా రోడ్లు బాగు చేస్తుందా.? లేదా.? అన్నది తేలిపోవాల్సిందే.

మీడియా ముందుకొచ్చి అడ్డగోలుగా పవన్ కళ్యాణ్ మీద రంకెలేసే మంత్రులు, కనీసం తమ తమ నియోజకవర్గాల్లో పాడైపోయిన రోడ్లైనా బాగు చేయగలరా.? రోడ్లను బాగు చేసే దిశగా తమ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రాగలరా.? ‘మా నియోజకవర్గాల్లో రోడ్లు నాశనమైపోయాయ్.. ఎప్పుడు బాగు చేస్తాం.?’ అని ముఖ్యమంత్రిని నిలదీసే ధైర్యం ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకి వుంది.

రోడ్లపై గుంతలకు సంబంధించి విపక్షాలు నిరసనలు తెలిపిన ప్రతిసారీ, ‘వానాకాలం’ కబుర్లు చెబుతూ, కుంటిసాకులతో కాలం వెల్లబుచ్చుతున్న వైసీపీ సర్కార్ చిత్తశుద్ధి ఏంటో ఇప్పటికే నిరూపితమైపోయింది. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. కోవిడ్ నిబంధనల్ని కుంటి సాకుగా చూపుతూ, పవన్ కళ్యాణ్ పర్యటనలకు అనుమతి లేదని ప్రభుత్వ పెద్దలు, పోలీసు వ్యవస్థ ద్వారా చెప్పించేందుకు ప్రయత్నిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ధవలేశ్వరం బ్యారేజీ పైనా, అనంతపురం జిల్లాలో కొత్త చెరువు రహదారిపైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయనున్నారు. ప్రభుత్వాలు అచేతనావస్థలో వున్నప్పుడే, విపక్షాలు.. ప్రజలు శ్రమదానం చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నది నిర్వివాదాంశం. రోడ్ల మరమ్మత్తుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల తాలూకు నిజాల నిగ్గు తేలిపోయే సమయమొచ్చింది.

‘సన్నాసులు’ అని పవన్ కళ్యాణ్ విమర్శించగానే, అంతెత్తున ఎగిరెగిరిపడి.. బూతులతో సంస్కార హీనంగా మీడియా ముందు విరుచుకుపడిపోయిన నేతలు, తమ గుండెల మీద చెయ్యేసుకుని.. తమ నియోజకవర్గాల్లో రోడ్ల దుస్థితి గురించి మాట్లాడతారేమో చూడాలిక.