బస్తీ మే సవాల్: ఏపీలో పవన్ కళ్యాణ్ ‘ఫ్రీ’ సినిమా.!

అసలు ఏం చూసుకుని పవన్ కళ్యాణ్‌కి అంత ధైర్యం.? రాజకీయ పార్టీని నడపాలంటే బోల్డంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలోనే, తిరిగి సినిమాల్లో నటించేందుకు ఆయన ముందుకొచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ సినిమాలకి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అడ్డు తగులుతోంది. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఏం జరిగిందో చూశాం.

‘భీమ్లా నాయక్’ సినిమాకి ఏం చేయబోతోంది వైసీపీ సర్కారు.? కేవలం పవన్ కళ్యాణ్‌ని దెబ్బకొట్టేందుకోసం, రాష్ట్రంలో సినిమాపై కత్తిగట్టేసింది అధికార వైసీపీ. కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చారు. బెనిఫిట్ షోలు లేవు, టిక్కెట్ ధరల పెంపు లేదు. సమోసా కంటే చీప్‌గా సినిమా టిక్కెట్ల ధరల్ని దించేసింది జగన్ సర్కార్.

పెట్రోల్ సహా అన్ని రేట్లూ మండిపోతోంటే, కేవలం సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గించి సామాన్యుల్ని ఉద్ధరించేస్తున్నామని చెప్పుకుంటోన్న వైఎస్ జగన్ సర్కారుకి, మరో మారు దిమ్మ తిరిగే షాకిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘నా ఆర్థిక మూలాల్ని దెబ్బ తీస్తే.. నేనేమీ వెనక్కి తగ్గను. నా సినిమాని ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీగా వేస్తాను..’ అంటూ జనసేన అధినేత వ్యాఖ్యానించారు.

పవన్ ఉచితంగా వేస్తారు సరే, నిర్మాతల సంగతేంటి.? పెద్ద సినిమాలకు టిక్కెట్ ధరలు పెగరకపోతే కష్టమని నిర్మాతలంటున్నారు. అది నిజం కూడా. తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది.. తెలుగు సినిమా స్థాయి కూడా పెరిగింది. బడ్జెట్ హద్దులు దాటేస్తోంది.. క్వాలిటీ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో సినిమా టిక్కెట్ కూడా పెరగాల్సిందే.

టిక్కెట్ ధర పెరిగినా, నిర్మాత పూర్తిగా గట్టెక్కుతాడనే నమ్మకం లేదు. సినిమా బాగోకపోతే ఉచితంగా సినిమా వేసినా ఎవరూ చూడరనీ, బాగుంటే ఎంతైనా ఖర్చు చేసి సినిమా చూస్తారని ఇటీవలే ఓ నిర్మాత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మొత్తమ్మీద, పవన్ మరోమారు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. ఒకరొకరుగా పెయిడ్ ఆర్టిస్టులు ఇకపై మీడియా ముందుకొస్తారు.. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు. అంతే తప్ప, విశాఖ స్టీలు ప్లాంటు సహా.. రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యపైనా పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పరుగాక చెప్పరు.