పవన్ కల్యాణ్ ఈసారైనా సక్సెస్ అవుతాడా?

పవర్స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల విరామం తరువాత మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. `వకీల్ సాబ్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అంగీకరిస్తూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్ని కూడా విస్మయానికి గురిచేస్తున్నారు. ప్రస్తుతం మలయాళ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా తెరకెక్కిన `భీమ్లా నాయక్` తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పవన్ తో పాటు ఈ చిత్రంలో రానా కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీ ఈ సంక్రాంతికి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా వుంటే పవన్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి నిర్మాతగా మారుతున్నారు. గతంలో రెండు భారీ చిత్రాలకు పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించారు. అందులో ఒకటి `సర్దార్ గబ్బర్ సింగ్`. బాబి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆశించిన స్థాయి ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ చిత్రాన్ని శరత్ మరార్ తో కలిసి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా నిర్మాతగా పవన్ కు భారీ నష్టాలనే అందించింది.

ఆ తరువాత మిత్రుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సుధాకర్ రెడ్డితో కలిసి నితిన్ హీరోగా `ఛల్ మోహన రంగ` చిత్రాన్ని చేశారు. కృష్ణచైతన్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోగా విమర్శల పాలయ్యేలా చేసింది. క్రియేటివ్ వర్క్స్ అని పేరు పెట్టి మరీ ఇంత నాసిరకమైన స్క్రిప్ట్ లని అంగీకరించమేంటని ఓ దశలో రామ్ గోపాల్ వర్మతో పాటు కొంత మంది అభిమానులు పెదవి విరిచారు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై చేయాల్సిన సినిమాలు ఇవి కాదని బ్యానర్ వ్యాల్యూకి తగ్గ కథల్ని ఎంచుకుని కొత్త తరహా చిత్రాల్ని అందించండని ఇండస్ట్రీ వర్గాలు కూడా సెటైర్లు వేశాయి.

ఇదిలా వుంటే తాజాగా పవన్ కల్యాణ్ మరోసారి నిర్మాతగా మరో ప్రయత్నం చేయడానికి రెడీ అయిపోతున్నారు. అయితే ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ ప్రెజెంటర్ గా మాత్రమే వ్యవహరిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన హీరో డైరెక్టర్ ఫిక్స్ అయిపోయారట. త్వరలోనే ఆ వివరాల్ని చిత్ర వివరాల్ని ప్రకటించే అవకాశం వుందని తెలిసింది. ఇప్పటి వరకు నిర్మాతగా విఫలమవుతున్న పవన్ కల్యాణ్ మరి ఈ సారైనా సక్సెస్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.