పవర్ స్టార్ ని వెంటాడుతున్న వైరస్ ఫీవర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం తరువాత `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ప్రారంభం అవుతున్న దశలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ గా విడుదలైన ఈ మూవీ కరోనా దశలోనూ మంచి వసూళ్లని రాబట్టి పవర్ స్టార్ ఖాతాలో సాలీడ్ బ్లాక్ బస్టర్ ని అందించింది.

అయితే ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ తో పవర్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలని లైన్ లో పెట్టేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించిన `భీమ్లా నాయక్` లో నటించారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీ కూడా రీమేక్ కావడం గమనార్హం.

మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ చిత్రాన్ని జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ప్లాన్ మారింది.

పవన్ క్రిస్మస్ వేడుకల కోసం భార్య అన్నా లెజరనోవాతో కలిసి అమెరికా వెళ్లిపోవడంతో `భీమ్లా నాయక్` ప్యాచ్ వర్క్ పెండింగ్ లో పడిపోయింది. తిరిగి వచ్చాక పూర్తి చేయాలనుకున్నా మళ్లీ కరోనా విలయతాండవం చేస్తుండటంతో రిస్క్ చేయడానికి పవన్ ఆసక్తిని చూపించడం లేదని చెబుతున్నారు.

సెకండ్ వేవ్ సమయంలో పవర్ కల్యాణ్ కరోనా బారిన పడి కొన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి రిస్క్ తీసుకోలేనని షూటింగ్ ని ఆపేశారట. `భీమ్లా నాయక్` తో పాటు `హరి హర వీరమల్లు` చిత్రీకరణ కూడా ఆగిపోయింది. ప్రస్తుతం ఈ మూవీ కోసం చాందినీ చౌక్ కు సంబంధించిన స్ట్రీట్ సెట్ ని ఏర్పాటు చేస్తున్నారు. అది పూర్తయినా పరిస్థితి అదుపులోకి వచ్చాకే సెట్ లో అడుగుపెట్టాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారట.

ప్రస్తుతం పవర్ కల్యాణ్ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించిన పనుల్లో ప్రస్తుతం బిజీగా వున్నారు. ఇక హైదరాబాద్ లో కరోనా కేసుల తీవ్రత మరింతగా పెరిగితే `భీమ్లా నాయక్` షూటింగ్ మరింతగా ఆలస్యం అయ్యే అవకాశాలు వున్నాయి.

దీంతో ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావించిన ఈ మూవీ మరోసారి పోస్ట్ పోన్ కావడం గ్యారెంటీ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.