పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ పై శృతి హాసన్ యు టర్న్.!

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ తన 26వ చిత్రం ‘వకీల్‌ సాబ్‌’ షూటింగ్‌ ని మొదలు పెట్టి దాదాపు 70% పూర్తి చేశారు. ఇంతలో కరోనా మహమ్మారి వచ్చి షూటింగ్స్ ని బ్రేక్ వేసేసింది. లేకపోతే ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యి నెలరోజులు అయ్యుండేది. ఇది కాసేపు పక్కనపెడితే.. షూటింగ్స్ మొదలయ్యాక పవన్ కళ్యాణ్ జోడీతో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూట్ చేయాల్సి ఉంది కానీ పవన్ తో జోడీ కట్టబోయే హీరోయిన్ ఎవరా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇటీవల ఈ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ శృతి హాసన్ తో సంప్రదింపులు జరిపామని, తనే హీరోయిన్ అని చెప్పాడు. కానీ శృతి హాసన్ మాత్రం నేను వకీల్ సాబ్ చేయడం లేదని, ఇప్పటి వరకు పవన్‌ కళ్యాణ్‌ సినిమా కోసం నన్ను ఎవరు సంప్రదించలేదు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దాంతో ఈ చిత్ర టీం మళ్ళీ హీరోయిన్ అన్వేషణలో పడి లావణ్య త్రిపాఠి, ఇలియానా, తమన్నా లాంటి వారిని కూడా పరిశీలించారు. కానీ ఎవరినీ ఫైనల్ చేయలేదు. వకీల్ సాబ్ హీరోయిన్ విషయంలో శృతి హాసన్ లేటెస్ట్ గా మరో ట్విస్ట్ ఇచ్చింది.

తాజాగా ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘తెలుగులో క్రాక్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ లో కూడా నటిస్తున్నాను. ఆ పాత్ర గురించిన పూర్తి విషయాలు ఇప్పుడు చెప్పలేను అంటూ’ శృతి హాసన్ అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఇది వరకు చేయట్లేదు అని చెప్పిన శృతినే ఇప్పుడు చేస్తున్నా అని స్టేట్మెంట్ ఇవ్వడం ఒకింత షాక్ అయ్యేలా చేసింది. షూటింగ్స్ మొదలయ్యే టైం వరకూ తన నిర్ణయం మారకపోతే వకీల్ సాబ్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల తర్వాత మూడోసారి వీరిద్దరూ వకీల్ సాబ్ లో జోడీ కట్టనున్నారు.

మరోవైపు అభిమానులు పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న ‘వకీల్ సాబ్’ టీజర్ రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో నిర్మాత దిల్ రాజుని డిమాండ్ చేస్తున్నారు. అంజలి, నివేత థామస్ ముఖ్యపాత్రల్లో పోషిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘పింక్’ సినిమాకి రీమేక్.