వేధింపుల కేసులో న్యాయం చేయండి.. కేంద్రమంత్రిని కోరిన నటి పాయల్

మీటూ ఉద్యమంలో కూడా వెలుగులోకి రాని వేధింపుల కేసులు సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో బయటకు వస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య, నెపోటిజం, డ్రగ్స్, వేధింపులు.. ఇలా బాలీవుడ్ అల్లకల్లోలంగా తయారైంది. ప్రేక్షకులకు విసుగొచ్చే స్థాయి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై ఇటువంటి విమర్శలే వచ్చాయి. నటి పాయల్ ఘోష్ ఆయనపై ఫిర్యాదు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

ఈ విషయమై పాయల్ ఘోష్ ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓ లేఖ అందజేశారు. ఇండస్ట్రీలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయమై పాయల్ ఘోష్ మంగ‌ళ‌వారం ఢిల్లీలోని జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు.

పాయల్ ఆరోపణలపై అనురాగ్ కశ్యప్ స్పందించారు. పాయ‌ల్ చేస్తున్న ఆరోప‌ణలు అన్నీ నిరాధారమైనవి అన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఇప్పటికే పాయ‌ల్ ఘోష్ అనురాగ్ కశ్యప్ పై చేసిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు ఆయనపై అత్యాచారం కేసు న‌మోదు చేశారు. కశ్యప్ ను అదుపులోకి తీసుకుని సుమారు 8 గంటలు విచారించారు.