అమ్మడి ఆశలు మళ్లీ అడియాసలయ్యనే..!

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ గా మారిన ఈ భామ.. వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ ఫార్మ్ లో కొనసాగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటోంది. అయితే తనను హీరోయిన్ ని చేసిన తమిళ ఇండస్ట్రీలో రాణించాలనే పూజా కోరిక మాత్రం తీరడం లేదు.

‘ముగముడి’ (తెలుగులో ‘మాస్క్’) అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసింది పూజా హెగ్డే. అయితే అమ్మడికి తొలి సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో రెండేళ్ల తర్వాత ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ‘డీజే-దువ్వాడ జగన్నాథమ్’ ‘మహర్షి’ ‘అరవింద సమేత వీర రాఘవ’ ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్లు అందుకుంది.

తెలుగులో అగ్ర స్థానంలో నిలిచినా పూజా కోలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకోవాలనే ప్రయత్నం మాత్రం వదల్లేదు. ఈ నేపథ్యంలో దాదాపు పదేళ్ల తర్వాత లేటెస్టుగా ”బీస్ట్” సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. దీంతో పూజా తమిళనాట కూడా స్టార్ హీరోయిన్ గా మారిపోతుందని ఫ్యాన్స్ భావించారు.

భారీ అంచనాల నడుమ బుధవారం విడుదలైన ‘బీస్ట్’ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. సినీ విశ్లేషకుల రివ్యూలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. సినిమా రిజల్ట్ ఏంటనేది పక్కన పెడితే.. ఇందులో పూజా హెగ్డే పాత్ర పట్ల అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇలాంటి ప్రాధాన్యత రోల్ లో క్యారక్టర్ లో ఎందుకు నటించిందో అని కామెంట్స్ చేస్తున్నారు.

‘బీస్ట్’ ట్రైలర్ లో అలా మెరుపుతీగ లాగా ఒక్కసారి అలా కనిపించి మాయమైనప్పుడే పూజా హెగ్డేకు ఇందులో ఏమాత్రం ఇంపార్టెన్స్ ఉందో అని ఆడియన్స్ ఆలోచించారు. అయితే ఇప్పుడు సినిమా చూశాక అందరికీ స్పష్టత వచ్చేసింది. ఎందుకంటే ఆమె పాత్ర అంతలా నిరాశ పరిచేలా ఉంది. రెండు పాటల్లో మెరవడం తప్పితే.. పూజా హెగ్డేకు ఇందులో ఏమాత్రం ప్రాధాన్యత లేదు.

ఇలాంటి సైడ్ క్యారక్టర్ గురించా ఇన్నాళ్లూ అమ్మడు ఇంత హంగామా చేసిందా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లకు కూడా సమప్రధాన్యత ఇస్తున్నారని భావిస్తున్న తరుణంలో.. ‘బీస్ట్’ సినిమాలో పూజా చేసిన రోల్ ఆ దృక్పథాన్ని మార్చేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

మొత్తం మీద పదేళ్ల తర్వాత తమిళంలోకి రీఎంట్రీ ఇచ్చినా.. దీని కోసం విజయ్ వంటి స్టార్ హీరో సహాయం తీసుకున్నా పూజా హెగ్డేకి అక్కడ నిరాశ తప్పలేదు. ఇటీవల ‘రాధేశ్యామ్’ తో ప్లాప్ అందుకున్న ఈ బ్యూటీకి వరుసగా ఇది రెండో పరాజయమనే అనుకోవచ్చు.

అయినప్పటికీ తెలుగులో అమ్మడికి అవకాశాల విషయంలో డోకా లేదు. కీలక పాత్ర పోషించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కనున్న ‘SSMB28’ మూవీలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నారు.

అలానే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో వస్తోన్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో నటించనుంది. నాగచైతన్య – డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో పూజా నే హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారని సమాచారం.

ఇక బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో ‘సర్కస్’ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఇదే క్రమంలో సల్మాన్ ఖాన్ తో ‘కబీ ఈద్ కబీ దివాలీ’ అనే ఓ సినిమాలో నటించనుంది పూజా. మరి వీటిలో ఏవేవి సూపర్ సక్సెస్ అందుకుంటాయో చూడాలి.