పెళ్లా…వ‌ద్దు బాబోయ్ అంటున్న న‌టి

యుక్త వ‌య‌స్సు వ‌చ్చిన త‌ర్వాత స‌హ‌జంగానే పెళ్లిపై మ‌ధుర ఊహ‌ల్లో తేలియాడుతుంటారు. త‌మ‌కు కాబోయే వాడు అలా ఉండాలి, ఇలా ఉండాల‌ని అమ్మాయిలు….అదే స‌మ‌యంలో అబ్బాయిలు కూడా క‌ల‌లు కంటుంటారు. అయితే పెళ్లంటే ఓ న‌టి భ‌యంతో వ‌ణికిపోతోంది. దానికి కార‌ణం లేక‌పోలేదు.

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం చిత్రాల్లో న‌టించిన పూర్ణ, పెళ్లి ప్ర‌స్తావ‌న తెస్తే చాలు నిలువునా కంపిస్తోంది. పెళ్లి పేరుతో ఇటీవ‌ల ఓ ముఠా ఆమెను మోసం చేసిన వ్య‌వ‌హారం సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయిన విష‌యం తెలిసిందే. మోస‌గాళ్ల‌ను క‌ట‌క‌టాల పాలు చేశారు. ఈ నేప‌థ్యంలో పెళ్లంటేనే పూర్ణ‌కు ఒక ర‌క‌మైన విర‌క్తి, అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డింది.

ఈ సంద‌ర్భంగా పూర్ణ మాట్లాడుతూ పెళ్లిపై త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. త‌న‌కు పెళ్లి చేసేందుకు త‌ల్లిదండ్రులు వ‌రుడి కోసం వెతుకులాట మొద‌టు పెట్టార‌న్నారు. ఇదే సంద‌ర్భంలో ఓ ముఠా త‌న త‌ల్లిదండ్రుల‌ను సంప్ర‌దించింద‌న్నారు. ఇరువైపుల పెద్ద‌లు మాట్లాడుకుని పెళ్లి ఫిక్స్ చేశాయ‌న్నారు. పెళ్లి అనంత‌ర జీవితం గురించి చ‌ర్చించేందుకు కాబోయే వాడితో చ‌ర్చించిన‌ట్టు పూర్ణ తెలిపారు.

ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు త‌న‌కు షాక్ ఇచ్చాయ‌న్నారు. ఆ ముఠా త‌మ‌తో ప్రేమ‌గా, అభిమానంగా వ్య‌వ‌హ‌రించి తీవ్ర మోసం చేసిన‌ట్టు పూర్ణ ఆవేద‌న‌తో చెప్పుకొచ్చింది. ఆ విష‌యం గురించి ఆలోచిస్తేనే భ‌య‌మేస్తుంద‌న్నారు. అస‌లు ఎవిరిని న‌మ్మాలో, ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో అర్థం కావ‌డం లేద‌ని ఆవేద‌న‌తో చెప్పుకొచ్చింది.

ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకోలేన‌ని తెలిపారు. దీంతో ఇప్పట్లో వివాహం చేసుకోవ‌ద్ద‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకుని, ఆ విష‌యాన్ని త‌న తల్లిదండ్రులతో కూడా చెప్పిన‌ట్టు పూర్ణ తెలిపారు. వివాహం అంటేనే త‌న‌కు భ‌య‌మేస్తోంద‌న్నారు. ఆ భ‌యంక‌ర పీడ క‌ల నుంచి కోలుకుని న‌ట‌న‌పై దృష్టి సారిస్తున్న‌ట్టు నటి పూర్ణ వెల్ల‌డించారు.