ప్రభాస్ తో రాజమౌళి మరో పాన్ ఇండియా ప్లాన్!

`బాహుబలి` ఫ్రాంఛైజీతో డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ నే మార్చేసారు దర్శకుడు రాజమౌళి. ఆ ఒక్క సినిమాతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ కి రీచ్ అయింది. ఎమోషన్.. వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా దేశ..విదేశాల్లో అనూహ్య విజయాన్ని సాధించింది.

తెలుగు సినిమా ఖ్యాతి ఖండాలు దాటి విశ్వవ్యాప్తమైంది. తెలుగు చిత్రం ఘనత అంటూ ప్రపంచమే మాట్లాడుకునేలా చేసింది ఆ ద్వయం. ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయి. పక్కా ప్రణాళికతో వెళ్లినా ఒక్కోసారి అది ఫెయిలవ్వొచ్చు. `బాహుబలి` ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని జక్కన్న సైతం ఊహించి ఉండరు.

`వార్` సినిమాలు ప్రపంచానికి కొత్తేం కాదు. కానీ బాలీవుడ్ మేకర్స్ సైతం చేయని సాహసాన్ని ఓ తెలుగు మేకర్ చేసి సక్సెస్ అవ్వడం..అది ఇండియాన్ సినిమా రికార్డుగా నిలివడం చరిత్రలో నిలిచిపోయే అంశం. మరి అలాంటి జోడీ మళ్లీ చేతులు కలుపుతుందా? ఈ కాంబినేషన్ లో మరో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతుందా? అంటే అవుననే అంటున్నారు డార్లింగ్ ప్రభాస్ . `రాధేశ్యామ్` ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ముంబై మీడియాతో మాట్లాడిన సందర్భంలో ప్రభాస్ ఈ విషయాన్ని రివీల్ చేసారు.

“రాజమౌళితో కచ్చితంగా సినిమా ఉంటుంది. ఓ చిన్న స్టోరీ ఐడియాపై ఇద్దరం డిస్కస్ కూడా చేసాం. ఇద్దరం ఎప్పుడు చేస్తామో కచ్చితంగా చెప్పలేను కానీ.. చేయడం మాత్రం పక్కా. ఈ విషయం గురించి రాజమౌళిని ప్రతేకంగా ఆడగాల్సిన పనిలేదు. మా ఇద్దరికి ఓ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు“ అని ప్రభాస్ తెలిపారు. ప్రభాస్ కన్ఫామ్ చేసాడు కాబట్టి జక్కన్న కూడా సిద్దంగా ఉన్నట్లే. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలందర్నీ పాన్ ఇండియా స్టార్లగా మార్చే పనిలో బిజీ అయ్యారు.

తొలుత `బాహుబలి`తో ప్రభాస్ ని పరిచయం చేయగా..`ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీర్ లను పరిచయం చేయబోతున్నారు. ఇదే నెలలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ ని పాన ఇండియా స్టార్ గా మార్చనున్నారు. ఇప్పటికే ఆయన కోసం మంచి స్క్రిప్ట్ కూడా సిద్దం చేసి పెట్టారు. ప్రిన్స్ తో పాన్ ఇండియా అంటే అంచనాలకు అందడం కష్టమే. మహేష్ ఇమేజ్ తో సాధారణ స్ర్కిప్ట్ లతోనే సునాయాసంగా 200 కోట్లు కొల్లగొడుతున్నారు.

అలాంటి స్టార్ కి రాజమౌళి లాంటి దిగ్దదర్శకుడు పాన్ ఇండియా అప్పీల్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ తర్వాత అంతటి పాన్ ఇండియా ఛరిష్మా మహేష్ సొంతమని ప్రచారం సాగుతోంది. బహుశా రాజమౌళి ఇలా పాన్ ఇండియా పరంగా వెనుకబడిన స్టార్లతో సినిమాలు చేయడం పూర్తయిన తర్వాత డార్లింగ్ తో సినిమా చేస్తారేమో.