ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్

రెబెల్ స్టార్ ప్రభాస్ వరస సినిమాలను కమిటైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఎవడె సుబ్రహ్మణ్యం, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా చేయనున్నాడు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని ప్రచారం జరుగుతోంది. ఆదిత్య 369 వంటి టైం మెషిన్ కాన్సెప్ట్ చిత్రంతో అందరినీ నివ్వెరపరిచిన విజనరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటర్ గా పనిచేయనుండడంతో, ఇది కూడా అదే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని భావిస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోన్ ను ఈ చిత్రానికి హీరోయిన్ గా ఎంచుకున్నారు.

ఇక నిన్న చెప్పినట్లుగానే ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. చెప్పాలంటే ఇది ఒక బడా అప్డేట్. “లెజండరీ సినిమా చేస్తున్నప్పుడు అందులో లెజండరీ నటుడు లేకపోతే ఎలా” అంటూ టీమ్ అప్డేట్ ను ఇచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఒక్కో అప్డేట్ వస్తున్న కొద్దీ ఈ సినిమా రేంజ్ అమాంతం పెరుగుతూనే ఉంది.

వైజయంతి మూవీస్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.