తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై మళ్ళీ వార్తలు

నందమూరి తారక రామారావు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా చాలా ఉత్సాహంగా సోషల్ మీడియాలో పుట్టినరోజు హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి ఏదొక అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ అంతా ఊహించారు కానీ అలాంటిదేం లేదని ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఇటీవలే తేల్చి చెప్పేసింది. లాక్ డౌన్ కారణంగా వీడియోకు సంబందించిన పనులు చేయడం కుదరలేదని కాబట్టి ఫ్యాన్స్ అందరూ అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు.

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తన సినిమాల గురించిన చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న ఎన్టీఆర్ అది పూర్తవ్వగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పనిచేయనున్నాడు. దీనికి సంబందించిన ప్రకటన కొన్ని నెలల క్రితమే వచ్చేసింది. అయితే త్రివిక్రమ్ తో సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.

ముందు చాలా పేర్లు అనుకున్నా కానీ చివరికి ప్రశాంత్ నీల్ కే ఎన్టీఆర్ ఓటు వేసాడని అంటున్నారు. కేజిఎఫ్ చిత్రంతో ప్రశాంత్ నీల్ ఇండియా వైడ్ ఫేమస్ అయిపోయాడు. తన నెక్స్ట్ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ కు దాదాపు 15 కోట్ల రూపాయల పారితోషికం ముట్టజెప్పనున్నట్లు సమాచారం. హిందీ, తెలుగు, తమిళంలో ఈ సినిమా ఏకకాలంలో తెరకెక్కుతుందని అంటున్నారు. ఈరోజే దీనికి సంబంధించిన ప్రకటన ఏమైనా వస్తుందా అని ఫ్యాన్స్ ఆశాభావంతో ఉన్నారు.