పూరితో కేజీఎఫ్‌ స్టార్‌ టాలీవుడ్‌ ఎంట్రీ

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఆల్‌ ఇండియా స్టార్‌ డం దక్కించుకున్న యశ్‌ ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. కరోనా కారణంగా షూటింగ్‌ పూర్తి కాలేదు. దాంతో సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రికార్డు స్థాయి వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధించిన యశ్‌ కు ఇక్కడ కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అందుకే యశ్‌ తదుపరి సినిమాను తెలుగులో చేయాలని దాన్ని పాన్‌ ఇండియా లెవల్‌ లో విడుదల చేయాలని ప్లాన్‌ చేసుకుంటున్నాడట.

కొన్ని నెలలుగా యశ్‌ తదుపరి సినిమా విషయంలో మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో యశ్‌ తెలుగు సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఆ వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పూరి ప్రస్తుతం చేస్తున్న విజయ్‌ దేవరకొండ మూవీ పూర్తి అయిన వెంటనే యశ్‌ తో సినిమా ఉంటుందట. అంతకు ముంద ఒక యంగ్‌ తెలుగు హీరోతో అనుకున్నప్పటికి ఆ సినిమా పోస్ట్‌ పోన్‌ అయ్యిందట. ఆ కారణంగానే ఇప్పుడు యశ్‌ తో సినిమాకు పూరి రెడీ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరికి ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే ఖచ్చితంగా వీరి కాంబో మూవీ నిజమైన పాన్‌ ఇండియా మూవీ అవుతుందంటూ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే కన్నడంలో పూరి సినిమాలు చేశాడు. కన్నడ హీరోలతో పని చేసిన అనుభవం పూరికి ఉంది. అందుకే యశ్‌ ను ఆయన అయితేనే తెలుగు వారికి దగ్గర చేయడంతో పాటు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ గా తీసుకు వస్తాడంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.