రాజేంద్రుడి ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ను ఇంటర్నేషనల్ హీరోను చేసిన సినిమా ‘క్విక్ గన్ మురుగన్’. శశాంక ఘోష్ రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. అంతర్జాతీయంగా అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు గెలుచుకుంది. రాజేంద్రుడికి ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చిపెట్టింది.

ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేయబోతున్నాడట రాజేంద్ర ప్రసాద్. కొన్నేళ్లుగా హీరో వేషాలు కట్టిపెట్టేసి.. క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితం అయిపోయిన ఈ సీనియర్.. వచ్చే ఏడాది ‘క్విక్ గన్ మురుగన్’ సీక్వెల్‌ మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించాడు. ఆనంద్ సురాపూర్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడట. ఇది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతుందని రాజేంద్ర ప్రసాద్ తెలిపాడు.

ఇక తన కెరీర్ గురించి.. కమిట్మెంట్ల గురించి రాజేంద్ర ప్రసాద్ చెబుతూ.. ”ఈ ఏడాది ఆరంభంలో ‘నాన్నకు ప్రేమతో’ చేశాను. అందులో నాన్నను నేనే. ఇప్పుడు ఏడాది ఆఖర్లో ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ వస్తోంది. ఇక్కడ ఇంటికి ఓనర్ నేనే. ఈ ఏడాది ఇంకా చాలా మంచి సినిమాలు చేశాను. 2017 కాల్షీట్‌ కూడా ఫుల్లుగా ఉంది. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానేమో తెలియదు. రామానాయుడు గారు నన్ను దర్శకత్వం చేయమని చాలాసార్లు అడిగారు. దర్శకత్వం చేసే లక్షణాలన్నీ నాలో పుష్కలంగా ఉన్నాయని అనిపించినప్పుడు ఆ దారిలో నడుస్తానేమో.  నిర్మాతగా మాత్రం నేను అట్టర్ ఫ్లాప్. అందుకే మళ్లీ సినిమాలు నిర్మించే ఆలోచన లేదు. కెరీర్‌ మొదలుపెట్టి నాలుగు దశాబ్దాలైంది. నన్ను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రల్ని రాస్తున్న రచయితలను, దర్శకులను మర్చిపోలేను” అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.