‘రాధేశ్యామ్’ కోసం బాలీవుడ్ కంపోజర్‌

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్న రాధేశ్యామ్‌ సినిమా చిన్న వీడియో బిట్‌ ను వ్యాలెంటైన్స్ డే సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాపై ఉన్న అంచనాల నడుమ వీడియో సాదా సీదాగా ఉంటే ప్రేక్షకులు ఒప్పుకునే పరిస్థితి లేదు. కనుక భారీ ఎత్తున ఈ టీజర్‌ కమ్‌ గ్లిమ్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఈ వీడియో కోసమే ప్రత్యేకంగా బాలీవుడ్ స్టార్ కంపోజర్‌ ను రంగంలోకి దించుతున్నారు.

బాలీవుడ్ స్టార్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ అయిన మిథున్‌ రాధేశ్యామ్‌ టీజర్‌ వీడియోకు బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ ను అందించాడు. ఇప్పటికే మిథున్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్ తో వీడియో రేంజ్ మరింతగా పెరిగింది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. బాలీవుడ్ రేంజ్ లో రాధేశ్యామ్‌ టీజర్‌ ఉండాలనే ఉద్దేశ్యంతో ఆయన్ను రంగంలోకి దించారు. అన్ని భాషలకు కలిపి ఒకే వీడియోను విడుదల చేయబోతున్నారు. తద్వారా రికార్డు స్థాయి వ్యూస్ ను నమోదు చేయవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.