చంద్రముఖి 2 స్టోరీలైన్‌ చెప్పిన డైరెక్టర్‌

2005లో వచ్చిన సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చంద్రముఖి చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత చంద్రముఖికి సీక్వెల్‌ చేయబోతున్నట్లుగా దర్శకుడు పి వాసు ప్రకటించాడు. మొదటి పార్ట్‌లో రజినీకాంత్‌ హీరోగా నటించగా సీక్వెల్‌లో మాత్రం లారెన్స్‌ హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యిందట.

ఇటీవల ఒక వెబ్‌ మీడియాతో దర్శకుడు పి వాసు మాట్లాడుతూ చంద్రముఖి 2 స్టోరీ లైన్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో స్టోరీ లైన్‌ ప్రధానంగా డాన్సర్‌ చంద్రముఖి మరియు ఆ రాక్షస రాజుకు మద్య సాగుతుందని అన్నాడు. చంద్రముఖి చిత్రంలో రాజు, డాన్సర్‌ చంద్రముఖిల సీన్స్‌ కొన్ని మాత్రమే ఉంటాయి. సీక్వెల్‌లో మాత్రం 85 శాతం వరకు ఆ కథ ఉంటుందని దర్శకుడు పేర్కొన్నాడు.

లారెన్స్‌ పాత్రపై దర్శకుడు సస్పెన్స్‌ క్రియేట్‌ అయ్యేలా వ్యాఖ్యలు చేశాడు. చంద్రముఖి 2 చిత్రంలో లారెన్స్‌ చేయబోతున్న పాత్రను ఎవరు ఊహించలేరు అంటూ వ్యాఖ్యలు చేశాడు. లాక్‌ డౌన్‌ పూర్తి అయిన తర్వాత షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు బాలీవుడ్‌ హీరోయిన్‌ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. తమిళంలోనే కాకుండా తెలుగు మరియు హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు.