‘బాహుబలి-2’లో కీరవాణి అదరగొట్టేశాడట

‘బాహుబలి: ది బిగినింగ్’లో కంటే ‘ది కంక్లూజన్’ అన్ని రకాలుగా గొప్పగా ఉంటుందని అంటున్నాడు రాజమౌళి. తొలి భాగంలో కేవలం పాత్రల పరిచయమే జరిగిందని.. కథ కూడా సగమే చెప్పామని.. రెండో భాగంలో కథలో మరింత కీలకమైన మలుపులు ఉంటాయని రాజమౌళి తెలిపాడు. ఎమోషన్లు.. యాక్షన్ ఎపిసోడ్లు ఇంకా పెద్ద స్థాయిలో ఉంటాయని జక్కన్న అన్నాడు. అన్నింటికీ మించి కీరవాణి సంగీతం ‘ది బిగినింగ్’లో కంటే ‘ది కంక్లూజన్’లో గొప్పగా ఉంటుందని రాజమౌళి చెప్పాడు.

”మా అన్నయ్య కాబట్టి నేను కీరవాణి గారి గురించి ఎక్కువ చెబుతున్నాను అనుకోవచ్చు. తొలి భాగంలో కంటే కూడా ఆయన రెండో భాగానికి చాలా మంచి పాటలిచ్చారు. పాటలు వింటుంటే ఉద్వేగం కలిగింది. ఇందులో ప్రతి పాటా బాగుంటుంది. నేపథ్య సంగీతం కూడా చాలా బాగా చేస్తున్నారు. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో ఆడియో చాలా బెటర్ అని కచ్చితంగా చెప్పగలను” అని రాజమౌళి తెలిపాడు.

మరోవైపు ప్రభాస్ సైతం కీరవాణి మ్యూజిక్ ‘ది కంక్లూజన్’లోనే బాగుంటుందని చెప్పాడు. ”ఫస్ట్ పార్ట్ లో నాకు పాటలు బాగా నచ్చాయి. ఐతే రెంటినీ పోల్చాల్సి వస్తే మాత్రం ‘ది కంక్లూజన్’ బెటర్ అని చెబుతా. ‘ది బిగినింగ్’లో పాటల్ని తెర మీద చూసుకున్నపుడు  ఎక్కువ బాగున్నాయనిపించింది. కానీ ‘ది కంక్లూజన్’లో మామూలుగా విన్నపుడే  వండర్ ఫుల్ ఫీలింగ్ కలిగింది. పాటలతోనే గూస్ బంప్స్ వచ్చాయి. రేప్పొద్దున ప్రేక్షకులు కూడా ఇదే ఫీలవుతారు” అని ప్రభాస్ అన్నాడు. –