రాజమౌళి కొడుకు పిండేశాడు

తెరమీద ఎమోషన్లు పండించడంలో రాజమౌళి శైలే వేరు. రోమాలు నిక్కబొడుచుకునేలా.. కళ్లు వర్షించేలా ఎమోషనల్ సీన్లను అద్భుతంగా తీర్చిదిద్దుతుంటాడు జక్కన్న. ఇప్పుడు రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా జనాల్ని ఎమోషనల్‌గా టచ్ చేసేస్తున్నాడు. ఐదేళ్లకు పైగా సుదీర్ఘంగా సాగిన ‘బాహుబలి’ ప్రయాణం ముగింపు దశకు వచ్చేసిన నేపథ్యంలో కార్తికేయ ఒక ఎమోషనల్ లెటర్ రాసి.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది ఫిలిం సర్కిల్స్‌లో చర్చనీయాంశం అవుతోంది. నెటిజన్లు కూడా దాని గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు.

‘బాహుబలి’ తన జీవితాంతం గుర్తుంచుకునే ప్రయాణం అని.. ఈ సినిమాకు తొలి అడుగు పడే సమయానికి తనకు 19 ఏళ్లు మాత్రమే అని.. ఇది పూర్తయ్యేటప్పటికి తనకు 26 ఏళ్లు వచ్చాయని.. ఈ ఆరేడేళ్లలో తాను ఎంత ఎదిగానో మాటల్లో చెప్పలేనని అన్నాడు కార్తికేయ. వ్యక్తిగతంగా.. వృత్తిగతంగా తనలో ఎంతో మార్పు వచ్చిందని.. ఈ ప్రయాణంలో తాను కలిసిన ప్రతి వ్యక్తి నుంచీ ఎంతో నేర్చుకున్నానని కార్తికేయ అన్నాడు.

‘బాహుబలి’ టీంలో తనపై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తుల గురించి చెబుతూ ముందుగా నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తావన తెచ్చాడు కార్తికేయ. ‘బాహుబలి: ది బిగినింగ్’కు తొలి రెండు రోజులు డివైడ్ టాక్ వచ్చినపుడు తామంతా కంగారు పడితే.. శోభు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడని.. సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి గొప్ప స్థాయికి తీసుకెళ్లాడని.. నావల్స్, వీఆర్, కామిక్స్.. ఇలా ఎన్నో విధాలుగా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడని చెప్పాడు.

ఇక తన పిన్ని వల్లి ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరినీ తల్లిలా చూసుకుందని అన్నాడు కార్తికేయ. ఇక తన తండ్రి.. తన మెంటార్ అయిన రాజమౌళి కోరుకున్న పర్ఫెక్షన్ కోసం తామంతా శ్రమించామని ఆ ప్రయాణంలో తామందరం పర్ఫెక్షన్ సాధించామని అన్నాడు. చివర్లోకి వచ్చేసరికి కార్తికేయ ఎమోషన్ అంతా కనిపించింది. అది జనాలనూ కదిలించింది.