రాజశేఖర్ చికిత్సకు స్పందిస్తున్నారు.. వదంతులపై హెల్త్ బులెటిన్

ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు డాక్టర్ రాజశేఖర్ ఇటివల కరోనా పాజిటివ్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన చిన్న కుమార్తె శివాత్మిక ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నాన్న కోవిడ్ నుంచి కోలుకునేందుకు తీవ్రంగా పోరాడుతున్నారు. నాన్న త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధించండి’ అని విజ్ఞప్తి చేసింది. దీంతో రాజశేఖర్ ఆరోగ్యంపై వార్తలు వెలువడ్డాయి. దీనిపై సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

‘కరోనా పాజిటివ్ తో ఆస్పత్రిలో చేరిన రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలోనే ఉన్నారు. వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారు’ అని ఆస్పత్రి మెడికల్ డైరక్టర్ డాక్టర్ రత్న కిశోర్ వెల్లడించారు. దీనిపై మరోమారు శివాత్మిక స్పందిస్తూ వదంతులు నమ్మొద్దు.. నాన్న ఆరోగ్యం బాగానే ఉంది అంటూ విజ్ఞప్తి చేశారు.

రాజశేఖర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘నాకు సహ నటుడు, స్నేహితుడు అయన రాజశేఖర్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. శివాత్మిక.. మీరందరూ ధైర్యంగా ఉండండి. అందరి ప్రార్ధనలు ఫలిస్తాయి’ అని ట్విట్టర్ అకౌంట్ రాజశేఖర్ క్షేమాన్ని కోరుకున్నారు.