మీడియా ఇంటరాక్షన్ కు దూరంగానే రకుల్..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో ఈ మధ్య ఆఫర్స్ తగ్గిపోయాయి. ‘మన్మథుడు-2’ ‘చెక్’ సినిమాలు పరాజయం చెందడంతో ఇప్పుడు ‘కొండ పొలం’ చిత్రంపైనే అమ్మడు ఆశలు పెట్టుకుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ కు జోడీగా నటించింది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అంతా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నా.. రకుల్ మాత్రం మీడియాకు దూరంగా ఉంది.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఎన్సీబీ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన మీద అసత్య కథనాలు ప్రచురించే మీడియాలను నియంత్రించాలని కోర్టుకు కూడా వెళ్లింది. అప్పటి నుంచి రకుల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటూ వచ్చింది. ‘చెక్’ ప్రమోషన్స్ లో కూడా డైరెక్ట్ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొనలేదు.

ఇటీవల టాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రకుల్ ప్రీత్ కు నోటీసులు జారీ చేసి విచారించారు. అప్పటి నుంచి రకుల్ అందుబాటులోకి వస్తే డ్రగ్స్ వ్యవహారం గురించి అడగాలని మీడియా ఎదురు చూస్తోంది. ఇప్పుడు ‘కొండ పొలం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వస్తుందని అనుకున్నారు. అయితే ఈసారి కూడా రకుల్ డైరెక్ట్ మీడియా ఇంటరాక్షన్ ను దాటవేసింది. మీడియా ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం లేని ‘కొండ పోలం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి మాత్రం రకుల్ హాజరైంది

రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా రెండు చిత్ర బృందాలు.. ముందుగా రికార్డ్ చేసిన వీడియోలు ఇంటర్వ్యూలను మీడియా సంస్థలకు ఇచ్చారు. మరి రకుల్ ఇలా ఎంతకాలం మీడియా ఇంటరాక్షన్ కు దూరంగా ఉంటుందని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా వుండగా రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం తో కలిసి ‘ఎటాక్’ సినిమా చేస్తోంది. అలానే బిగ్ బి అమితాబ్ బచ్చన్ – అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘మే డే’ సినిమాలలో రకుల్ కీలక పాత్ర పోషిస్తోంది. వీటితో పాటుగా తమిళ హిందీ భాషల్లో పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ‘కొండ పొలం’ సినిమా తర్వాత తెలుగులో చేయబోయే మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.