రామ్ చరణ్ త్యాగం ఫలించింది

దసరా మిస్ అయినపుడు ధృవ చిత్రం రిలీజ్కి సంక్రాంతి అనుకూల సమయమని ఫాన్స్ అనుకున్నారు. కానీ ‘ఖైదీ నంబర్ 150’ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందే ఫిక్స్ అవడంతో అన్ సీజన్ అయినా కానీ ధృవని డిసెంబర్లో విడుదల చేయడానికి చరణ్ తెగించాడు. డిసెంబర్లో రిలీజ్ చేయడం వల్ల తన సినిమా బిజినెస్పై కనీసం పది కోట్ల భారం పడుతుందని తెలిసినప్పటికీ చరణ్ రిస్క్ చేసాడు. నిజానికి ఆ రిస్క్ వల్ల మొత్తంగా డ్యామేజ్ జరిగి ఉండేది.

కానీ సినిమా బాగుండడం వల్ల డిసెంబర్ రిలీజ్ని, డీమానిటైజేషన్ని తట్టుకుని యాభై అయిదు కోట్ల షేర్ సాధించింది. అనుకూలమైన సీజన్లో వచ్చినట్టయితే కనీసం పది కోట్లయినా అడ్వాంటేజ్ వుండేది. కానీ తండ్రి సినిమాకి తన చిత్రం ఏ విధంగాను అడ్డు రాకూడదని చరణ్ ధృవని డిసెంబర్లో ఎర్లీగా రిలీజ్ చేసేసాడు. దాని వల్ల ఖైదీ వచ్చేసరికి ధృవ థియేటర్లన్నీ ఇచ్చేయడానికి వీలు కుదిరింది. తండ్రి రీఎంట్రీ తన సినిమా కంటే ప్రతిష్టాత్మకమని, కీలకమని భావించి చరణ్ చేసిన ఈ త్యాగం వృధా పోలేదు.

సంక్రాంతికి విడుదలైన ‘ఖైదీ నంబర్ 150’ మిగిలిన అన్ని సినిమాలపై పైచేయి సాధించి, తొలి వారంలో రికార్డుల మోత మోగించింది. ఆరు రోజుల్లో డెబ్బయ్ కోట్లకి పైగా షేర్ రాబట్టిన ఈ చిత్రం వంద కోట్ల షేర్ సాధించే దిశగా దూసుకుపోతోంది.

మెగాస్టార్ కోసం చాలా చేసిన చరణ్ని గుర్తించిన అభిమానులు అతడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. అన్నట్టు మెగాస్టార్ మలి చిత్రాన్ని కూడా చరణ్ నిర్మిస్తున్నాడు. ఈసారి వచ్చినట్టే పక్కా ప్లానింగ్తో సినిమాకి హైప్ తీసుకురావాలని కృషి చేస్తున్నాడు.