అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి 2.. మరో రెండు రోజుల్లో వెండి తెర మీద ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దీన్ని మరింత పెంచేందుకు చిత్రబృందం ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి తన ఫోకస్ అంతా బాలీవుడ్ మీడియా మీద పెడితే.. సినిమాలో నటించిన వారు మాత్రం.. లోకల్ మీడియాతో తమ అనుభవాల్ని చెప్పుకొస్తున్నారు.
బాహుబలి మొదటి పార్ట్లో.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన శివగామి క్యారెక్టర్ లో జీవించిన రమ్యకృష్ణ తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. మొదటి భాగంలో బిడ్డను చేత పట్టుకొని.. నీళ్లలో మునిగిపోతున్న సీన్ చూస్తాం. ఆ సీన్ చేసేటప్పుడు తానెంతో భయానికి గురైనట్లుగా చెప్పిన ఆమె.. ఆ సీన్ను షూట్ చేసింది ఎక్కడ? అప్పుడు తానెలా ఫీలైందన్న విషయాన్ని వివరంగా చెప్పుకొ్చ్చారు.
నీటిలో మునిగి పసిబిడ్డను పైకెత్తి పట్టుకునే సన్నివేశం తనకు అత్యంత సవాల్ విసిరేదన్న రమ్యకృష్ణ.. ఈ సీన్ను కేరళలోని చల్లకుడి జలపాతం వద్ద షూట్ చేసినట్లుగా వెల్లడించారు. అక్కడ నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుందని.. సుడులు తిరుగుతూ ప్రవహించే ఆ నీళ్లలోకి నేను మునిగి చేయి పైకి పెట్టి ఉంచాలని.. కానీ.. నీటి వేగం నన్ను అటూఇటూ లాగేస్తూ ఉండేదన్నారు.
ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు తానెంతో భయపడ్డానని.. అప్పుడు రాజమౌళి తనతో.. శివగామి ముఖంలో నేను భయం చూడకూడదన్నారని.. ఏం జరిగినా పట్టించుకోవద్దని చెప్పినట్లుగా గుర్తు చేసుకున్నారు. దీంతో.. భయాన్ని పక్కన పెట్టేసి షూటింగ్లో పాల్గొన్నానని.. నీట్లో మునిగినప్పుడు చాలా భయం వేసినా.. పైకి లేచినప్పుడు మాత్రం తన ముఖంలో భయం ఉండేది కాదని.. మొదటి పార్ట్లో పాత్రల పరిచయం మాత్రమే ఉంటుందని.. రెండో భాగంలోనే అసలు కథంతా ఉంటుందని.. మొదటి పార్ట్ ఊహలకు.. అంచనాలకు అందని రీతిలో సెకండ్ పార్ట్ ఉండనుందంటూ తన మాటలతో మరింత ఊరించేశారు రమ్యకృష్ణ.