‘మానాడు’ రీమేక్ కోసం రంగంలోకి రానా!

తెలుగులో ఇప్పుడు రీమేకుల హవా కొనసాగుతోంది. ఇతర భాషల్లో భారీ విజయాలను అందుకున్న సినిమాలను ఇక్కడ రీమేక్ చేయడమనేది చాలా కాలంగా ఉన్నదే. అయితే ఈ మధ్య కాలంలో రీమేకుల జోరు మరింత ఊపందుకుంది. చిరంజీవి చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ .. ‘భోళా శంకర్’ సినిమాలు రీమేకులే. ఇక పవన్ చేసిన ‘వకీల్ సాబ్’ .. రీసెంట్ గా పూర్తి చేసిన ‘భీమ్లా నాయక్’ కూడా రీమేకులే. ఇక ఒక తమిళ హిట్ మూవీ రీమేకులో రానా చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ సినిమా పేరే ‘మానాడు’.

తమిళనాట క్రితం ఏడాది సందడి చేసిన సినిమాలలో ‘మానాడు’ ఒకటి. క్రితం ఏడాది నవంబర్ లో వచ్చిన ఈ సినిమాలో హీరోగా శింబు .. విలన్ గా ఎస్.జె.సూర్య చేశారు. వి హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. పొలిటికల్ డ్రామాను టచ్ చేస్తూ సాగే కథ ఇది. హీరో .. విలన్ ల మధ్య ఇంట్రెస్టింగ్ మైండ్ గేమ్ తో ఈ కథ నడుస్తుంది. విభిన్నమైన కథ .. ఆసక్తికరమైన పాత్రలు .. అనూహ్యమైన మలుపులతో ఈ సినిమా సాగుతుంది. అందువలన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.

చాలా కాలంగా శింబు సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఈ సినిమా ఆయనకి కొంత ఊరటను .. ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూ ఉండగా ఈ సినిమా రీమేక్ హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ వారు దక్కించుకున్నారు. అందువలన తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేయడం కుదరలేదు.

సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని రెండు ప్రధానమైన పాత్రలలో ఒక పాత్రకి గాను రానాను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మరో పాత్ర కోసం ఎవరిని తీసుకోనున్నారనేది త్వరలో తెలియనుంది. తమిళంలో ‘మానాడు’ను తెరకెక్కించిన దర్శకుడు వెంకట్ ప్రభుకి తెలుగు రీమేక్ బాధ్యతలను అప్పగించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణుల పేర్లను త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నారు.