లక్కీ బ్యూటీకి అలాంటి పరిస్థితి రాదు కదా..??

కన్నడ భామ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె లైనప్ లో ఇప్పుడు హిందీ తెలుగు తమిళ కన్నడ చిత్రాలతో పాటుగా పలు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ మధ్య అమ్మడి సందడి పెద్దగా కనిపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంలో.. ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మిక కు బాలీవుడ్ లో మంచి ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలో హిందీ అవకాశాలు దక్కించుకుంది. అయితే ఆమె నటించిన చివరి సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవకపోవడం నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా వెలుగొందుతున్నప్పటికీ.. రష్మిక పాపులారిటీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రానికి ఏ విధంగానూ సహాయపడలేదని రిజల్ట్ చూస్తే అర్థం అవుతుంది. ‘పుష్ప’ సినిమా కారణంగా కొన్ని నెలల క్రితం వరకు వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ.. ఒక్క పరాజయంతో సైలెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

దీనికి తోడు రష్మిక నటించిన సినిమా ఏదీ ఇప్పుడప్పుడే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. అందుకే ఈ బ్యూటీ తదుపరి మూవీ వచ్చే వరకు లో ప్రొఫైల్ లో ఉంటుందని.. నెక్స్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోకపోతే నంబర్ గేమ్ నుండి తప్పుకోవాల్సి వస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇకపోతే రష్మిక మందన్నా ప్రస్తుతం విజయ్ సరసన #Thalapathy66′ చిత్రంలో నటిస్తోంది. ఇది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం. అలానే హను రాఘవపూడి – దుల్కర్ సల్మాన్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘సీతా రామం’ అనే ట్రయాలజీలో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్రలో కనిపించనుంది.

అంతేకాదు పుష్ప రెండో భాగం ‘పుష్ప: ది రూల్’ సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి అలరించనుంది రష్మిక. ఇక సిద్దార్థ్ మల్హోత్రా తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ‘మిషన్ మజ్ను’ చిత్రంతో అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెట్టనుంది. ఇదే క్రమంలో సందీప్ రెడ్డి వంగా – రణబీర్ కపూర్ కాంబోలో రూపొందే ‘యానిమల్’ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.

అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘గుడ్ డే’ చిత్రంలోనూ రష్మిక భాగం కానుంది. అంటే ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం అర డజనుకు పైగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఆమె కెరీర్ నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లడానికి ఏ విధంగా సహాయ పడతాయో చూడాలి.