మారేడుమిల్లి అడవిలో రామారావు ఆన్ డ్యూటీలో

మాస్ రాజా రవితేజ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదు ప్రాజెక్ట్ ల్ని లైన్ లో పెట్టి పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే `ఖిలాడీ` షూటింగ్ పూర్తిచేసారు. ప్రస్తుతం `రామారావు ఆన్ డ్యూటీ`ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. హైదరబాద్..వైజాగ్ సహా వివిధ ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం రామారావు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఆదివారం నుంచి చివరి షెడ్యూల్ ని తూర్పుగోదావరి జిల్లా మారేడు మిల్లి అడవి అందాల నడుమ ప్రారంభించారు.

ఇక్కడ భీకర అడవుల్లో కీలక థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజుల పాటు యూనిట్ ఇక్కడే షూటింగ్ చేయనుంది. రవితేజతో పాటు కీలక పాత్రధారులంతా షూట్ లో పాల్గొంటున్నారు. సినిమాలో ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మారేడుమిల్లి అందాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. మారేడుమిల్లి లోకేషనస్ ఆన్ స్క్రీన్ ఎంతో అందంగా కనిపిస్తాయి. పచ్చని చెట్లు…ఘాట్ రోడ్లు..జలపాతాల నడుమ అక్కడి అందాలు అద్భుతంగా ఉంటాయి. రామారావు ఆన్ డ్యూటీ షూట్ లో భాగంగా అక్కడ ఏకంగా ఒక షెడ్యూల్ నే ప్లాన్ చేసారంటే మారేడుమిల్లి ప్రత్యేకత ఏంటో అర్ధమవుతోంది. ఇంతకుముందు పుష్ప షూటింగ్ చాలా భాగం మారేడుమిల్లి అడవుల్లో గిరిజనుల నడుమ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రవితేజ అదే లొకేషన్ లో పని చేయడం ఆసక్తికరం.

ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది. అనంతరం పాటల చిత్రీకరణ కోసం యూనిట్ విదేశాలు వెళ్లనుంది. ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జోడీగా దివ్యాంశకౌశిక్..రజిషా విజయన్ నటిస్తున్నారు. అలాగే వేణు తొట్టెంపూడి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ చిత్రంతో కంబ్యాక్ అవ్వడం విశేషం. సుధాకర్ చెరుకూరి-రవితేజ సంయుక్తంగాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.