ఈ వారం బరిలో ‘రిపబ్లిక్’ .. అందరి చూపు ఆ వైపే!

సాయితేజ్ హీరోగా దేవ కట్టా ‘రిపబ్లిక్’ సినిమా చేశాడు. భగవాన్ – పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఈ వారం విడుదల కానున్న ఈ సినిమాపైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. కొన్ని రోజుల క్రితం బైక్ పై నుంచి పడిపోయిన సాయితేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఆయన లేకుండానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

సాయితేజ్ స్టేజ్ పై లేకుండా .. ఆయన చేసే సందడి లేకుండా ఈ వేడుక జరగడం చాలామందికి బాధను కలిగించింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అతిథులు కూడా ఈ సినిమాను సూపర్ హిట్ చేసి ఆ సంబరంతో సాయితేజ్ కి స్వాగతం పలకాలనే మాట్లాడారు. సాయితేజ్ కి తన మేనమామలు సపోర్టుతో పాటు వాళ్ల అభిమానుల సపోర్ట్ కూడా ఉందని చెప్పుకొచ్చారు. దాంతో అభిమానులంతా కూడా ‘రిపబ్లిక్’ సినిమాపై దృష్టి పెట్టారు. ఇది మెగా ఫ్యామిలీ హీరో సినిమా .. ఆయన ప్రమోషన్స్ లో పాల్గొనే పరిస్థితి లేదు. అందువలన తాము రంగంలోకి దిగాలనే భావిస్తున్నారు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన పవన్ కూడా సాయితేజ్ పట్ల తనకి గల ప్రేమానురాగాలను చాటుకున్నాడు. అవతల హాస్పిటల్లో సాయితేజ్ కళ్లు తరవకుండా పడుంటే ఎవరి ఇష్టానికి వాళ్లు మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ మాటలు అభిమానుల మనసులను భారం చేశాయి కూడా. ఇక ఈ సినిమా కథాకథనాలు కూడా ప్రేక్షకులలో ఆ ఆసక్తిని పెంచుతున్నాయి. అవినీతి పరులైన రాజకీయనాయకుల వలన సమాజానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందనేది ఈ కథలో చర్చించారు. అందుకోసం యువత ఏం చేయాలనేది చెప్పారు.

ఈ సినిమా టీజర్ .. ట్రైలర్ .. చూస్తుంటే రాజకీయ నాయకురాలిగా రమ్యకృష్ణ చాలా పవర్ఫుల్ పాత్రను పోషించిందనే విషయం అర్థమవుతోంది. ఇక ఒక ప్రభుత్వ అధికారిగా సాయితేజ్ ఆమెను ఎలా ఎదుర్కున్నాడు? అనేది కూడా చూపించారు. ఈ ఇద్దరూ కూడా నువ్వా? నేనా? అన్నట్టుగా చేశారనే విషయం స్పష్టమవుతోంది. ఈ తరహా పాత్రలను రమ్యకృష్ణ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో తెలిసిందే. ఈ తరహా సినిమాలు చేయడంలో దేవ కట్టా సిద్దహస్తుడు. ఈ సారి ఆయన రాసిన డైలాగ్స్ కూడా జనంలోకి బాగా వెళ్లాయి. పెద్దగా పోటీ లేకుండా థియేటర్లకు వస్తున్న ఈ సినిమాపైనే ఇప్పడు అందరి చూపు ఉంది. అందరూ ఆశిస్తున్నట్టుగా ఈ హిట్ తో సాయితేజ్ మరింత త్వరగా కోలుకోవాలనే కోరుకుందాం.