56 మంది సైనికుల కిడ్నాప్.. `సలార్` స్టోరి లీక్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీఎప్ `ఫేం` ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ఇప్పటికే రెట్రో స్టైల్లో ఇది మాస్ స్టోరీతో తెరకెక్కుతోందన్న సమాచారం లీకైంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ స్థాయిని మించి యాక్షన్ సన్నివేశా లు హైటైట్ గా ఉంటాయని ప్రచారం సాగడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఇంతలోనే సలార్ కథ లీకైంది. ఇది ఊహకి అందని అద్భుత స్క్రిప్ట్ నేరేషన్ తో డిజైన్ చేసినట్లు లీకులను బట్టి తెలుస్తోంది.

ఇంతకీ సలార్ కథేంటి? అంటే ఇది 1971 లో జరిగిన ఇండో-పాక్ వార్ స్టోరీ అని సమాచారం. ఆ కథను ఆధారంగా చేసుకుని స్క్రిప్ట్ ని పూర్తిగా సినిమాటిక్ గా మలిచినట్లు తెలిసింది. 1971 వార్ లో ఎన్నో ఆసక్తికర అంశాలున్నాయి. ఆ యుద్ధం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. 54 మంది భారత జవాన్లను పాక్ నిర్భందించింది. వీరిలో 27 మంది ఆర్మీ సైనికులు.. 24 మంది వైమానిక దళ సిబ్బంది తో పాటు ఒక బీ.ఎస్.ఎఫ్ జవాన్ ఉన్నారు. నిజానికి ఇంత మంది భారత సైనికులు పాక్ చెరలో ఉన్నారని భారత ప్రభుత్వానికి కొంత కాలం వరకూ తెలియదు.

ఇది ఇప్పటికీ మిస్టరీనే. పాక్ వారిని ఇంకా బంధీలుగా ఉంచిందా? లేక హత్య చేసి పగ తీర్చుకుందా? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. ఇరు దేశాల మధ్య ఈ వివాదం అప్పుడప్పుడు రగులుతూనే ఉంటుంది. భారత అధికారులతో పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ఈ విషయాన్ని సైతం వెల్లడించారు. భుట్టో రచించిన పుస్తకాల్లో సైతం ఈ విషయాన్ని పొందుపరిచారు. మరి స్టార్ మేకర్ ప్రశాంత్ నీల్ సరిగ్గా ఇదే పాయింట్ ని టచ్ చేస్తున్నారా? లేక వార్ లో ఇంకా అంతర్గత విషయాల్లోకి వెళ్లబోతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. కేజీఎఫ్ కూడా కోలార్ గనుల బ్యాక్ డ్రాప్ లో జరిగిన రియల్ స్టోరీనే తెరపైకి తీసుకొచ్చారు. అద్భుతమైన మేకింగ్ తో స్టార్ క్యాస్టింగ్ తో సినిమాని ఓ రేంజ్ లో చూపించారు. ఈ నేపథ్యంలో సలార్ అంతకు మించి ఉండబోతుందా? అన్న ప్రచారం అంతకంతకు హీట్ పెంచుతోంది. ఇది బార్డర్ వార్ నేపథ్యంలో దేశభక్తి చిత్రంగా ఉండనుంది. ఇందులో ప్రభాస్ దేశభక్తుడిగా కనిపిస్తారా? స్పై తరహా పాత్రలో నటిస్తారా? లేక ఆర్మీ అధికారిగా చెలరేగుతారా? అన్న ఇలాంటి సవాలక్ష సందేహాలకు ప్రశాంత్ నీల్ సమాధానం ఇవ్వాల్సి ఉంది.

కెరీర్ లో క్షణం తీరిక అయినా లేదే

భారీ హైప్ నడుమ `రాధేశ్యామ్` పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరి తో ఈ మూవీ తెరకెక్కింది. ఆ కాలం నాటి సెట్లు నిర్మించి యాక్షన్ సన్నివేశాల్ని అంతే హైలైట్ గా తీర్చిదిద్దారు. ఇది టైమ్ ట్రావెల్ నేపథ్యంలోని మూవీ అని ..ప్రతీ సన్నివేశం ఆద్యంతం ఆసక్తికరంగా ట్విస్టులతో ఎంతో అద్బుతంగా ఉంటుందని కథనాలొచ్చాయి. 2021 సంక్రాంతి .. సమ్మర్ రిలీజ్ అంటూ ప్రచారం సాగినా అది వీలుపడలేదు. ఇటీవలే రిలీజ్ తేదీని లాక్ చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. ఆదిపురుష్ 3డి చిత్రీకరణ సాగుతోంది. అలాగే నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ ఇటీవల ప్రారంభమైంది. త్వరలోనే ప్రభాస్ సెట్స్ లో చేరనున్నారు.